పుట:Andrulasangikach025988mbp.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అక్కిరాజు ఉమాకాంతముగారు, పల్నాటి వీరచరిత్ర పీఠికలో దాని నిట్లుదహరించినారు.

        "వీరులు దివ్యలింగములు, విష్ణువునాయుడు, కల్లిఫొతరా
        జారయ భైరవుండు, తుహినాద్రి జయంకమ, నిర్మలాంబునై
        కేరెడు గంగధార మడుగేమణి కన్యక, యన్నిభంగులన్
        గారెమపూడి పట్టణము కాశిసుమీ కనుగొన్నవారికిన్"

చనిపోయిన వీరులు లింగములై పూజలందిరి. చెన్నడు బ్రహ్మనాయుడే ! క్రీడాభిరామములో మాచెర్ల చెన్నడు, కల్లు పోతరాజు అనేవాడు చచ్చి, కాలభైరవస్థాన మాక్రమించెను. అంకమ్మ అనే స్త్రీ అన్నపూర్ణ అయ్యెను. గంగాధరమడుగు మణికర్ణిక యంతటి పవిత్రస్థాన మయ్యెను.

బెజవాడ కనకదుర్గమ్మను గురించి నేలటూరి వేంకటరమణయ్యగారిట్లు (S-I-Temple లో) వ్రాసెను. "ఒకగ్రామమం దేడ్గురు విప్రసోదరులుండిరి. వారికి కనకమ్మయను చెల్లె లుండెను. ఆమె శీలమును వారు సందేహింపగా నామె బావిలోపడి చనిపోయి జనుల బాధించు శక్తికాగా, జనులామెకు గుడికట్టి పూజింప దొడగిరి". నెల్లూరిలోని దర్శి తాలూకాలోని లింగమ్మ అను బీదరాలొక ధనికునింటి సేవకురాలుగా నుండెననియు, ధనికుల సొత్తు లపహృత మగుడు ఆమెపై నిందవోపగా నామె బావిలో పడి చచ్చి దేవరయ్యెననియు, నెల్లూరు జిల్లాలోని పొదిలమ్మయు, సందేహింపబడి చంపబడిన యొక స్త్రీశక్తిగా మారినట్టి దనియు, నూరేండ్ల క్రిందటగూడ కోటయ్య అను లింగబలిజి ఒక గొల్ల మగనాలినిగూడి ఆమె భర్తచే వధింపబడి కోటప్పకొండ దేవరగా ప్రసిద్ధు డయ్యె ననియు శ్రీ నేలటూరివారు వ్రాసినారు. ఈవిధముగా నేటికిని దేవర్లు పుట్టుచూ చచ్చుచూ తెనుగు దేశపు జనసామాన్యుల మూర్ఖతను లోకానికి చాటినవైనవి.

అరుదుగా నరబలులుకూడా ఇయ్యబడుచుండెను. అట్టి నరబలులు నిర్జన ప్రదేశములో నుండు శక్త్యాలయములలో జరుగుచుండెను. ఒక భైరవాలయములో రెండుతలలను రెండు మొండెముల నొక సెట్టి చూచి

         "చంపుడుగుడి యిది యని యా
          దంపతుల కళేబరములు తలలుం గని తత్