పుట:Andhrula Charitramu Part 2.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కరుణ దీనానాథ కవిబంధు జన చకో
రములకు జంద్రాతపముగ జేసి,
కీర్తిజాలముద్రిలోకీశారికకు నభి
రామరాజిత పంజరముగ జేసి,

గీ. సుందరీజనంబు డొదంబునకు దన
నిరుపమాన మైననేర్పుకలిమి,
నతిప్రసిద్ధి చేసి యసదృశలీలమై
బరగె మనుమసిద్ధి ధరణివిభుడు."

అని తిక్కభూపాలుని తండ్రియగు మనుమసిద్ధి రాజు వర్ణింణపబడియున్నాడు. తెలుగు చోడులల దిక్కనృపతి సుప్రసిద్ధుడును, పరాక్రమవంతుడునైయున్నాడు. ఇతడు బాల్యముననేఅసహాయశూరుడై యుద్ధములను జేసి విజయములను గాంచుచు వచ్చెననుటకు దృష్టాంతములు గలవు.

తిక్కరాజు పృథ్వీశ్వరరాజును జంపుట.

ఈ తిక్కభూపతి శైశవమునందనగా బదునెనిమిదేండ్ల ప్రాయమునకు లోపలనే పృథ్వీశ్వర రాజుతో యుద్ధముచేసి రణరంగమున వాని మస్తకమును ద్రుంచి దానితో గందుకగ్రీడ గావించినాడని నిర్వచనోత్తరరామాయణమునందీ క్రిందిపద్యమువలన దేటపడుచున్నది.

"ఉ. కేశవసన్నిభుండు పరిగీత యశోనిధి చోళతిక్కధా
త్రీశుడు కేవలుండె, నృపులెవ్వరి కాచరితంబు గల్గునే,
శైశవలీలనాడు పటు శౌర్యధురంధర బాహుడైన పృ
ధ్వీశ నరేంద్రుమస్తకము నేడ్తెఱ గందుకకేళి సల్పడే."