నెల్లూరు శాసనమున మనుమసిద్ధిరాజు పేరు గానంబడుచున్నది. కాబట్టి పై రెండు శాసనములలోని సిద్ధిరాజు మధురాంతక పొత్తపిచోడ మనుమసిద్ధిరాజని యూహింపవచ్చును. ఇతడు తమ్ముసిద్ధిరాజుయొక్క జ్యేష్ఠసోదరుడనియు, చోడ తిక్కనృపాలుని తండ్రియగు మనుమసిద్ధిరాజు యొక్క తమ్ముడును తన పినతమ్ముడు నైన తమ్ముసిద్దిరాజు నిమిత్తమై రాజ్యపాలనము వహించినటుల జెప్పబడిన రెండవ బేటరాజుయొక్క శాసనములేవియు నెల్లూరున గప్పట్టవు. [1]
మధురాంతక పొత్తపిచోడ తమ్ముసిద్ధిరాజు.
ఇతని శాసనములు తెలుగుదేశమునందును, అరవదేశమునందునుకూడ గానవచ్చుచున్నవి. ఈ తమ్ముసిద్ధిరాజుయొక్క కావలి శాసనములలో నతని వంశావళి పేర్కొనబడినది గాని, తక్కిన శాసనములలోని వానితో గొంచెము భేదించి యున్నది.
కరికాలుని వంశమున బేటరాజు జనించెననియు, నతనికి ఎర్రసిద్ధిరాజు పుట్టెననియు, నతనికి శ్రీదేవిగర్భమున తమ్ముసిద్ధి మొదలుగా గొందరు కొమారులు పుట్టిరనియు, వారిలో నల్లసిద్ధి తమ్ముసిద్ధికి జ్యేష్ఠసోదరుడనియు బేర్కొనబడియున్నది. 'మన్మ'యనుటకు 'నల్ల'యని నెల్లూరుశాసన సంపాదకులు పొరబాటున భావించియుందురేమోయని సంశయము కలుగుచున్నది. ఇందు నల్లసిద్ధిరాజు పట్టాభిషిక్తుడయ్యెడనియు, నతని యనుమతినంది యతని చినతమ్ముడు తమ్ముసిద్దిరాజు రాజ్యపాలనము చేయుచున్నాడనియు చెప్పబడినది. శా.శ.1129 వ సంవత్సరమున (క్రీ.శ.1207-08)తన తల్లిపేరిట బరంగు శ్రీపురమును బండారు త్రిపురార్యుడు మొదలగు వేదవేత్తలయిన బ్రాహ్మణులకు నగ్రహారముగా నొసంగినటుల వ్రాయబడినది. మరియు నితడు పళ్ళికొండ పెరుమాళ్ళకు ముండనాటిలోని తామరమడువు చెరువను గ్రామమును దానముచేసినటుల నెల్లూరిలోని యొక యరవ
- ↑ Ep.Ind. Vol.VII. p.122