దానియందు బేటరాజునకు సిద్ధిరాజను జ్యేష్ఠసోదరుడు కలడని చెప్పబడినదికావున, విమలాదిత్యుడా సిద్ధిరాజనకు కొడుకని చెప్పవచ్చును.
మధురాంతక పొత్తపి చోడ నల్లసిద్ధిరాజు.
మధురాంతకపొత్తపి చోడబేటరాజునకు "దయభీమరాజు, నల్లసిద్ధిరాజు, ఎర్రసిద్ధిరాజు” అను ముగ్గురు కొమారులుగలరు. వీరిలో నల్లసిద్ధిరాజు కాంచీపురమును జయించి గైకొనియెనని చెప్పబడియున్నది. ఇందెంత మాత్రమయిన సత్యముండునేని చోడచక్రవర్తియైన మూడవ కులోత్తుంగ చోడునికి బూర్వము జరిగియుండును. ఎందులకన, నల్లసిద్ధిరాజు తమ్ముడైన ఎర్రసిద్ధిరాజు పుత్త్రులయిన మనుమసిద్ధిరాజు, తమ్ముసిద్ధిరాజు మూడవ కులోత్తుంగ చోడదేవునకు సామంతమాండలిక రాజులుగునుండి కప్పముగట్టువారుగ నుండిరి. త్రిభువన చక్రవర్తియైన మూడవ కులోత్తుంగ చోడదేవుని శాసనములలో గొన్నిట నాతడు కాంచీపురమును వశపరచుకొనుటయు, జయవిజృంభణముతో నగరము సాత్తెంచుటయు, బేర్కొనబడుట చూడ, నల్లసిద్ధిరాజునుండి గైకొనియెనని యూహింపనవకాశము గలిగించుచున్నది.
మధురాంతక పొత్తపి చోడ మనుమసిద్ధి రాజు
మూడవ త్రిభువన చక్రవర్తి కులత్తుంగ చోడదేవుని పరిపాలన కాలమున శా.శ.1112వ సంవత్సరమునకు సరియైన క్రీ.శ.1189వ సంవత్సరముననొక సిద్ధిరాజు కోవూరు గ్రామమును నెల్లూరనియెడు విక్రమసింహపురములోని యొక విష్ణ్వాలయమునకు దానము చేసినట్లు దెలిపెడి శాసనమొకటి ప్రాచీనమైనదిగ గన్పట్టుచున్నది. ఇందు సంస్కృత భాగములో సిద్ధిరాజుపేరు గలదు గాని, ద్రావిడ భాగములో ఆ నామము చాలా భాగము శిథిలమై పోయినందను స్పష్టముగ దెలియరాకున్నది. ఇంతియగాక జయంకొండ చోడ మండలములోని యొక భాగమగు చేదికుల వలనాటిలోని నెల్లూరనెడు విక్రమసింహపురములోని నాగరీశ్వరదేవునకు పూగినాటి లోని యెఱ్ఱంపల్లి గ్రామములో గొన్ని భూములను దానము చేసినట్టు దెలిపెడు