మధురాంతక పొత్తపి చోడుడును, తెలుగు బిజ్జనయు నున్న కాలము మనకు దెలియరాదు. బిజ్జన మొదటివాని వంశమున జనించెనని శాసనములలో చెప్పబడియుండుటం జేసి యా యిరువురకు నడుమగల కాలము దీర్ఘమైయుండవలయును. ఈ నెల్లూరు తెలుగుచోడులను గూర్చిన చరిత్రమును దెలిసికొనుటకు బూర్వమీదేశభాగము (నెల్లూరునకు దక్షిణభాగము) యొక్క పూర్వచరిత్రమును గొంత దెలిసికొనవలయును.
నెల్లూరు పూర్వచరిత్రము.
తొమ్మిదవ శతాబ్దాంతమున దక్షిణ హిందూస్థానమున బాండ్యుల బలపరాక్రమములు క్రమక్రమముగా క్షీణించుచుండినవి. ఆదిత్యచోడుడు గాంగపల్లవ రాజయిన అపరాజితుని నోడించి వాని రాజ్యమాక్రమించుకొన్నందునను, [1]మొదటి పరాంతకుని శాసనములు నెల్లూరు సరిహద్దునకు విశేషదూరముగాని కాళహస్తికి సామీప్యమున గనిపట్టబడినందునను, చోడులు తమ రాజ్యమును నెల్లూరు మండలములోని దక్షిణ భాగమునకు వ్యాపింపజేసి వేంగీదేశపాలకులగు తూర్పుచాళుక్యులకు బొరుగువారయిరని యూహింపవచ్చును. చోడుడైన మొదటి పరాంతకుడు గాంగపల్లవులకు సామంతులయిన బాణులను జయించినట్లుగ జెప్పుకొనియెను. బాణరాజుల శాసనములు గొన్ని కాళహస్తికి సామీప్యముననున్న గుడిమల్లము కడ గానిపించినవి. [2]ఈ భాగము పేరంబాణప్పాడియను పేరంబరగుచుండెను. పదియవ శతాబ్ద మధ్యమున రాష్ట్రకూటులు చోడరాజ్యములో నొక కొంతభాగము నాక్రమించుకొనుటచేత కొంతకాలము చోడుల ప్రభ కొంచెము తగ్గినంతమాత్రమున చో