పుట:Andhrula Charitramu Part 2.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లోని మనుమసిద్ధీశ్వరుని యాలయ నిర్మాణముకొరకును, ధూపదీప నైవేద్యాలంకారము కొరకును, వినియోగించునటుల దానశాసనము వ్రాయించిరి.[1]

కృష్ణాపట్టణము గొప్ప రేవు పట్టణము

ఆ కాలమునందు కొల్లిత్తురై యనియు, గండగోపాల పట్టణమనియు పేర్కొనబడిన కృష్ణాపట్టణము గొప్ప రేవు పట్టణముగా నుండెనని పై శాసనమునుబట్టి విస్పష్టమగుచున్నది. పదునెనిమిది విదేశములనుండి యైదు వందల మంది విదేశ వర్తకులును, ఆయా నాడులనుండియు, పట్టణములనుండియు, పంచమండలముల నుండియు వచ్చినట్టి వర్తకులును, ఆ రేవుపట్టణమున నివసించుచుండి రని యా శాసనమునందు జెప్పబడియుండుట చేతనే యా కాలమునందు కృష్ణాపట్టణము (Krishnapatam) గొప్ప రేవు పట్టణముగా నుండెననియు, విదేశములతో విరివిగా వర్తక వ్యాపారము జరుగుచుండె ననియు, జక్కగా బోధపడుచున్నది. ఇతడు విశేష కాలము రాజ్యపాలనము చేసినట్టు గానరాదు.

మనుమగండగోపాలుడు

ఇమ్మడి తిక్కరాజునకు వెనుక మనుమగండగోపాలుడు రాజ్యపాలనము వహించెను. ఇతడు క్రీ.శ.1282-83వ సంవత్సరమున బట్టాభిషిక్తుడైనటుల నెల్లూరుసీమలోని కొడవలూరు చెరువులోని యొక రాతి మీద వ్రాయబడిన రెడ్ల దానశాసనము వలన దెలియుచున్నది. నెల్లూరు తెలుగు చోడులలో మనుమగండగోపాల నామము గలవారిరువురు గనుపట్టుచున్నారు. ఒక మనుమగండగోపాలుడు నెల్లూరునకు దక్షిణభాగమునను, మరియొక గండగోపాలుడు నెల్లూరునకు ఉత్తరభాగమునను, పరిపాలనము చేసినట్లు శాసనము వలన దేటపడుచున్నది గాని, వీరురువునకు నెట్టి సంబంధము గలదో బోధపడకున్నది. వీరిలో మొదటి మనుమగండగోపాలుడు, తిక్కరాజునకు వెనుక వెనువెంటనే రాజ్యపదవిని బొందక, కాకతీయ సైన్యాధిపతులలో నొక్కడగు అంబదేవమహారాజుయొక్క సాహాయ్యము

  1. Nellore Inscriptions. Vol.1.p414, Gudur (45)