పుట:Andhrula Charitramu Part 2.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
ఆంధ్రుల చరిత్రము.

సాధ్యము గాదని సూచించుచు నాతని చేత మెప్పు గాంచిన ప్రోడనని ఘనతగా నీ క్రింది పద్యమున జెప్పుకొని యున్నాడు.


గీ.కవిత చెప్పి యుభయకవి మిత్త్రు మెప్పింప
  నరిది బ్రహ్మ కైన; నతడు మెచ్చ
  బరగ దశకుమార చరితంబు చెప్పిన
  ప్రోడ నన్ను వేఱె పొగడనేల?

ఇతడు వేగి విషయములోని వెఱ్ఱిరాల యను నగ్రహారమున కధిపతి, మ్రానయకును నంకమాంబకును జనించిన ద్వితీయ పుత్త్రుడు, ప్రోలనార్యుని తమ్ముడు. బండారు కేత దండాధీశుని మఱిది, సంస్కృతాది భాషాకావ్యకర్తృత్వమున నుతిగన్నవాడు. అట్టి విఖ్యాతయశు డైన కేత నార్యుని రావించి యుత్యాదరంబున నాసనార్ఘ్య పాద్య తాంబూలాంబరాభరణదానాద్యు పచారంబుల బరితుష్ట హృదయుం జేసి ' నీవు సంస్కృ తాద్య నేక భాషా కావ్య రచనావిశారదుం వగుట జగత్ప్రసిద్దంబు గావున నొక్క కావ్యంబు రచియించి నన్ను గృతి పతిం జేయ వలయు.' నని తిక్కన సోమయాజి ప్రార్థింపగా, నతడు దశ కుమార చరిత్రమును దెలిగించి యాతని కంకితము చేసినట్లుగా నవతారిక యందు వ్రాసి యున్నాడు. ఇతడు దశకుమార చరిత్రమును మాత్రమే గాక కాదంబరిని, విజ్ఞానేశ్వరీయ మను యాజ్ఞవల్క్యధర్మ శాస్త్రమును, దెనిగించెను. ఆంధ్ర భాషా భూషణము రచించుటకు ముందు దెనుగున వ్యాకరణ మెద్దియు రచియింప బడియుండ లేదని,


క.మున్ను తెలుగునకు లక్షణ
  మెన్నడు నెవ్వరును జెప్ప రేజెప్పెద వి
  ద్వన్నికరము మది మెచ్చగ
  నన్నయభట్టాది కవి జనంబుల కరుణన్.

అని చెప్పి యున్నంత మాత్రమున నదివఱకు దెలుగులో వ్యాకరణము మెదలగునవి లేవని యెంత మాత్రమును దలప రాదు. నన్నయ భాట్టారకునికి