పుట:Andhrula Charitramu Part 2.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాకు లేదు. వేయునేల? ప్రపంచమునందలి సమస్తభాషలలోని యుత్తమోత్తమ కావ్యములలో నిదియొక్కటి యని చెప్పవచ్చును. ఈ మహాకవిని గూర్చి రావుబహదరు వీరేశలింగము పంతులుగా రాంధ్రకవులచరిత్రమునందిటుల వ్రాసియున్నారు.

" కాని తిక్కనసోమయాజిశైలితో సమానముగా వ్రాయుటమాత్ర మెవ్వరికిని సాధ్యము కాదు. తెలుగు భాషయం దెన్నో ద్రంథము లున్నను, తిక్కనసోమయాజి కవిత్వముతో సమానముగా గాని, దానిని మించునత్లుగా గాని, కవిత్వము చెప్పగలిగినవారు నేతివర కొక్కరును గనబడ లేదు. తిక్కనకవిత్వము ద్రాక్షాపాకమై మిక్కిలి రసవంతముగా నుండును. ఈతని కవిత్వమున బాదపూరణమునకయి తెచ్చిపెట్టుకొనెడు వ్యర్థపదము లంతగా నుండవు. పదములకూర్పు మాత్రమేగాక యర్ధసందర్భమును మిక్కిలి పొందికగా నుండును. ఏ విషయము చెప్పినను, యుక్తియుక్తముగాను ప్రౌఢముగాను నుండును; ఎక్కడ నేవిశేషణము లుంచి యేరీతి నేపదములు ప్రయోగించి రసము పుట్టింపవలయునో యీకవికి దెలిసినట్లు మరియొకరికి దెలియదు; ఈతని కవిత్వము లోకోక్తులతో గూడి జాతీయముగా నుండును; ఈయన పదలాలిత్యమును, యుక్తిబాహుళ్యమును, అర్ధగౌరవమును రచనా చమత్కృతియు, శయ్యావిశేషమును, సందర్భశుద్ధియు, కల్పనాకౌశలమును, అన్యులకు రావు. "

శ్రీమదాంధ్రమహాభారతమునకు బీఠికవ్రాసిన బ్రహ్మశ్రీ, శతఘటము వేంకటరంగశాస్త్రులవా రీకవిని గూర్చి యిటుల వ్రాసియున్నారు.

" ఏ విషయమునంజూచినను నిమ్మహాకవికి సమాను డని చెప్పదగిన కవి యొక్కడు నిప్పటికి వినబడడు. ఇక నధికుడు లేడని చెప్పనేల ? ఈమహాకవి కవనముంగుర్చి యెంతసెప్పినం జెప్పవలసియే యుండునుగాని, యొకప్పటికైనం దనివిదీర జెప్పినట్లుండదు.... ఈమహాకవి గ్రంథముం జూచి నేర్చుకొనవలసిన విషయములు నెన్నియేని గలవు. ఆంధ్రభాషాకవిత్వ మర్మ మాతనికి దెలిసినట్టులు మరి యేయాంధ్రకవికి నిప్పటికిని తెలియదనియు, నిరాపేక్షముగ జెప్పవచ్చును. "