పుట:Andhrula Charitramu Part 2.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ సిద్ధనామాత్యుడాప్తమంత్రిగ నుండుట మాత్రమేగాక సేనాపతిగగూడ నుండెనని పై పద్యమును బట్టియే తెల్లమగుచున్నది. ఇతని ఇంటిపేరు కొట్టరువువారు. ఇతడు సుప్రసిద్ధుడైన మంత్రి భాస్కరుని తృతీయపుత్త్రుడు. శూరవరాగ్రణి యగు ఖడ్గతిక్కనకు దండ్రి. కవిబ్రహ్మయైన తిక్కన సోమయాజికి బెదతండ్రి. ఈ కొట్టరువు వంశమువారిలో బెక్కండ్రు తెలుగుచోడ రాజుల కడ బ్రధానమంత్రులుగను, సేనాపతులుగను, ఆస్థాన కవీశ్వరులుగను ఉండి యాంధ్రప్రపంచమునందంతట విఖ్యాతిగాంచియున్నారు. వీరిలో మంత్రి భాస్కరుడు గుంటూరు సీమకు బాలకుడుగ నియమింపబడియుండెను. ఇతడు రామాయణమును మొదట రచింపగానది యే కారణముచేతనో అరణ్యకాండము తక్క తక్కిన కాండములన్నియు శిథిలములయి పోవుటచేత హళక్కి భాస్కరాది కవులు వానిం బూరించిరనియు, ఆ రామాయణమే భాస్కరరామాయణమను పేర బరగుచున్నదనియు నాంధ్రులచే విశ్వసించబడుచున్నది. గాని మంత్రి భాస్కరునిబట్టి గాక హళక్కి భాస్కరుని బట్టియే యా గ్రంథమున కానామము వచ్చినదనియే నా యభిప్రాయము. ఇది చర్చాంశము గనుక గ్రంథవిస్తరభీతిచేతను, మరియొక తావున నీ విషయమునుగూర్చి చెప్పవలసి యుండుటచేతను, ప్రస్తుతము నేనాచర్చ నిట వివరింపంబూనుకొనలేదు.

మంత్రి భాస్కరుడు రామాయణమును రచించినను, రచించియుండకపోయినను, ఆతడు ప్రసిద్ధకవి యనుటకు సందియములేదు. తిక్కనసోమయాజి తన నిర్వచనోత్తర రామాయణమునందు :-
"సారకవితాభిరాము గుంటూరి విభుని
మంత్రి భాస్కరు మత్పితామహుని దలచి
యైన మన్ననమెయి లోకమాదరించు
వేల నా కృతిగుణులు వేయునేల?"

అని తన కావ్యము స్వగుణముచేత గాకపోయినను, తన పితామహుడైన మంత్రి బాస్కరుని సారకవిత్వమహిమచేతనైనను, లోకాదరణమునకు