పుట:Andhrula Charitramu Part 2.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ రామయ్య పంతులు గారు వ్రాసిన పై జాబు నాకు వెంటనే చేరగలిగినందుల కెంతయు సంతసించితిని. ఈ చరిత్రమును మిక్కిలి సంతోషముతో బఠించెదనని వ్రాసినందులకు నేనును మిక్కిలి సంతసించితిని. తరువాత రెండుమాసములకు జెన్నపురిలో ప్రెసిడెన్సీ కాలేజీ భవనమున నన్నయభట్టారకుని వర్ధంతి మహోత్సవము జరుగుటకు బూర్వమా కాలేజి భవనమున వారి దర్శనము లభించెను. అట్టి ప్రథమ సందర్శన కాలమున జరిగిన సంభాషణములో బంతులుగారు చరిత్ర మింకను జదువవలెనని ముచ్చటించిరి. అనంతరమనేక సందర్భములలో వారితో గలిసి సంభాషించుట సంభవించినను ప్రథమ చరిత్ర గ్రంథమును గూర్చిన ప్రశంస వచ్చియుండలేదు. ఏయే చరిత్రాంశముల నాతో నేకీభవింతురో ఏయే చరిత్రాంశముల నాతో నేకీభవింపరో తెలిసికొనవలయున్న యపేక్ష గలిగియుంటిని గాని యెప్పుడును గ్రంథమును జదివినట్లు చెప్పియుండనందున నట్టి యపేక్షను వదలుకొని మిన్నకుండవలసినవాడనైతిని.

ఆంధ్రపత్రిక యొక్క రెండవయుగాది సంచిక

ఇట్లుండ ఆంధ్రపత్రిక యొక్క రెండవ యుగాది సంచికలో “ఆంధ్రభాషామహాసంఘ”మను శీర్షికతో రామయ్య పంతులు గారు వ్రాసినయొక చిన్న వ్యాసము ప్రకటింపబడియెను. ఆంధ్రులచరిత్రమును గూర్చి యందిట్లు వ్రాయబడినది.