మచ్చటనాటి వారలనుద్దేశించి "యోనాగరాజులారా! పవిత్రమైన నాయీ వృక్షమును బూజింపుడు; నా ప్రియులారా! మీకిది సౌఖ్యమును మనశ్శాంతిని కలుగజేయును" అని పలికి వెడలిపోయెను. క్రీస్తు శకము రెండవ శతాబ్దమున సింహళ ద్వీపమును బాలించిన మల్లనాగడు, చండనాగడు, కూడనాగడు, శ్రీనాగడు అను వారలు నాగరాజులుగా గన్పట్టుచున్నారు. ప్రప్రథమమున చోళదేశమునకు రాజధానిగ నుండిన కావీరి పద్దినము (కావేరి పట్టణము) సనాతనకాలమునందు నాగులకు నివాసమై నాగవాటికి ముఖ్యపట్టణమై యుండెనని చిల్లప్పదిక్కారమను తమిళ కావ్యమునందు వర్ణింపబడియెను. పురాతన తమిళ కావ్యములయందు నాగుల చరిత్రము విశేషముగా నభివర్ణింపబడియున్నది. కిల్లిసలివానడు చోళరాజు నాగజాతి కన్యను వివాహమాడియుండగా నొక కవి మణిమేకలై (మణిమేఖల) యను తమిళ కావ్యమునందా వివాహమును బూసగ్రుచ్చినయట్లుగా వివరించి వర్ణించి యున్నాడు. ద్రావిడదేశమునందలి మరపలు, అయినారులు, ఒలియారులు, ఒనియారులు, అఱవలారులు, పరదనారులు మొదలగు తెగలవారెల్లరును నాగజాతులవారనియె చెప్పబడుచున్నారు. పదునొకండవ శతాబ్దమునందు ఒలియర్లను నాగజాతివారు పరాక్రమవంతులుగనున్నట్లొక శాసనము వలన గన్పట్లుచున్నది. కరికాల చోడుడను రాజు వీరలను జయించెనని యొక తమిళ కావ్యమునందు జెప్పబడినది. పదునొకండవ శతాబ్దమునందు కొప్పరకేసరి వర్మయను చోళరాజు కొప్పయను ప్రదేశమున, బశ్చిమ చాళుక్య రాజగు నావాసమల్లుని నోడించి మామళ్ళపురము (మహాబలిపురము) లోని వరాహస్వామి దేవాలయమునకు గొంత భూదానము చేసి శాసనము వ్రాయించెను. ఆ శాసనములో రాజకీయోద్యోగస్థులు కూడ కొందఱు చేవ్రాళ్ళు చేసియుండిరి. దానిలో "ఒలినాగన్ మదైయాన్ ఆలగీయ చోళ, అనువరడ్డు మువెందవేలన్, ఒలినాగన్ చంద్రశేఖరన్, ఒలినాగన్ నారాయనన్, ఇందు పరనాన్ సంగనాగన్, ఉచనకిలవాన్ ముగలినాగన్" అను నాగనాయకులు గూడ చేవ్రాళ్ళు చేసియుండిరి. పదునొకండవ శతాబ్దమునందు ఒలినాగులు మాత్రమే గాక సంగనాగులు, ముగలినాగులు మొదలగు తెగల నాగు