పుట:Andhrula Charitramu Part-1.pdf/400

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బడియుండిరి. బాణరాజులు గాంగపల్లవులకు లోబడియుండిరి. మైసూరులోని తలకాడు రాజధానిగ గాంగవాడి దేశమును బరిపాలనము సేయుచుండిన మారసింహుడను పశ్చిమగాంగరాజు నలంబకులమును నిర్మూలముజేసి నలంబకులాంతకుడని పేరు పొందెనట.[1] ఈ పశ్చిమ గాంగులుకూడ నాకాలమున రాష్ట్రకూటులకు లోబడినవారుగానేయుండిరి. పదవశతాబ్దాంతమునందు రాష్ట్రకూటులనుజయించి త్రైలోక్యమల్లుడనుపశ్చిమచాళుక్యుడు మరల దేశమును కైవసము జేసికొనియెను. చోడులు పశ్చిమగాంగులను జయించి వారియధికారమును నిర్మూలము జేసిరి.

తరువాత రెండుశతాబ్దములకాలము పశ్చిమచాళుక్యులకునుచోడులకువశమై యుభయపక్షముల వారికిని రణరంగభూమియై యెప్పుచుండెను.

విష్ణుకుండినవంశము.

విష్ణుకుండినులమని చెప్పుకొనిన రాజులశాసనములు రెండుమూడు మాత్రము గానంబడుచుండినవిగాని వీరియుదంతమేమో యెచ్చటినుండివచ్చినవారో యేకాలమునందున్నవారో స్పష్టముగా దెలియరాదు. పూర్వచాళుక్యులు వేంగికళింగదేశములను జయించుటకు బూర్వమీ విష్ణుకుండినులు కళింగదేశములో నేభాగముననో పరిపాలనము సేయుచుండినవారని తోచుచున్నది. ఈ విష్ణుకుండిన వంశమునకు మూలపురుషుడు మాధవవర్మయని పేర్కొనబడియెను. ఈ విష్ణుకుండిన మహారాజగు మాధ్వవర్మకును వాకటకరాణికిని జనించినవాడు విక్రమేంద్రవర్మ. వాకటకులు చేదిదేశమును(Central provinces) బరిపాలించుచుండిన యొక తెగరాజులుగనుండిరి. వీరిలో బ్రవరసేనుడు ప్రఖ్యాతుడు. విష్ణుకుండినడయిన మాధవవర్మయు బహుప్రసిద్ధిగలవాడుగ గన్పట్టుచున్నాడు. ఇతడశ్వమేధాదియాగములను మాత్రమేగాక పురుషమేధములనుగూడ జేసినట్టుగ జెప్పబడియెను. తండ్రి విష్ణుకుండినవంశములోని వాడును తల్లి వాకటక వంశములోనిదియు నగుటచేత విక్రమేంద్రవర్మ యుభయకులాభరణుడని పిలువంబడియెను. విష్ణుకుండినులలో విక్రమేంద్రవర్మ

  1. Mysore, I, 307.