పుట:Andhrula Charitramu Part-1.pdf/397

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హరించి యితడు క్రీ.శ.961-66 ప్రాంతములనున్నవాడని రైసుగారు దెలుపుచున్నారు. ఈ విక్రమాదిత్య తిరువయ్య 950దవ సంవత్సరమున నొక చెఱువును బాగుపఱిపించి యున్నవాడు గావున నితడును కీలూరుశాసనములలో నుదాహరింపబడిన చందయతిరువయ్యయు నొక్కడేయై యుందురని యూహింపవచ్చును. విక్రమాదిత్యుడను పేరు చందయయొక్క బిరుదునామమై యుండవచ్చును. విక్రమాదిత్య తిరువయ్య తనకొడుకునకు చంద్రశేఖరుడని పేరు పెట్టియుండుటచేత దండ్రిపేరు కొడుకునకు బెట్టినట్లుగ నూహింపదగియున్నది. ఈ పైనిజెప్పిన యూహలు సరియైనవేని రాష్ట్రకూటరాజగు మూడవకృష్ణుడు తిక్కోల యుద్ధమయినతరువాత తొండైమండలములోని యొక భాగమును బరిపాలించుటకై యీ వైదుంబ విక్రమాదిత్యుని నియోగించియుండునని తలంపవచ్చును. ఇందుచేతనే మొట్టమొదట నాంధ్రకర్ణాటకదేశములలో రాజ్యపాలనము చేయుచుండిన వైదుంబులు తొండైమండలములో స్థిరపడి తరువాత నచ్చటనే చోడరాజులగు మొదటరాజరాజునకును, మొదటిరాజేంద్రునకును లోబడిన సామంతమాండలికులుగనుండి పరిపాలనము జేయు గారణమైనట్టు గన్పట్టుచున్నది.[1] మదనపల్లి, పెదతిప్పసముద్రము శాసనములలో నుదాహరింపబడిన గండత్రినేత్రుడే వైదుంబులలో స్వతంత్రుడైన కడపటివాడుగానుండెను. వానికి బిమ్మట వైదుంబులు చోడరాజగు మొదటిపరాంతకునిచే జయింపబడిరి .[2] [3] కళింగదేశమును బాలించుచుండిన గాంగవంశజుడగు మూడవ వజ్రహస్తుని పట్టమహిషియుగు వినయమహాదేవి యీవైదుంబ రాజవంశములోనిదేయని తెలియుచున్నది.[4]

  1. Ep.car. vol intro. p. XX.
  2. South Indian Inscriptions vol. III. pp. 104. 107.
  3. Ibid, vol II. p379.
  4. Ind. Ant. vol XVIII. pp. 164 and 175 and Ep. bidIV. p. 186.