పుట:Andhrula Charitramu Part-1.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హులయిన యార్యులు వీరిదేశము నాంధ్రదేశమనియు, వీరి నాంధ్రులనియు బిలిచిరని చెప్పుమాట యుక్తియుక్తమయినదిగానే యుండును.

ఎల్లలు.

ఈ దేశమున కుత్తరమున నుత్కలమహారాష్ట్ర దేశములును, తూర్పున దూర్పుసముద్రమనియెడి బంగాళాఖాతమును, దక్షిణమున ద్రావిడకర్ణాటక దేశములును, పశ్చిమంబున కర్ణాటక మహారాష్ట్ర దేశములును గలవు.

విస్తీర్ణము.

ప్రస్తుతము హిందూదేశమును బరిపాలించుచుండిన బ్రిటీషు పరిపాలకులు పరిపాలనమున కనుకూలమగునటుల దేశము ననేక భాగములుగ విభాగించి యుండుటనుబట్టి యాంధ్రదేశము యొక్క విస్తీర్ణమును సరిగా నిర్వచించుటకు సాధ్యముగాదు. అయిన నొకరీతిగా నిర్ధారణము సేయవచ్చును. చెన్నపురి రాజధానిలో నుత్తరమునుండు గంజాము మండలములోని శ్రీకాకులమునుండి బయులుదేఱి తూర్పుసముద్రపుతీరము పొడవునను చెన్నపట్టణమున కుత్తరమున నున్న పాలయవేర్కాడు (ప్రళయకావేరి) వఱకునుబోయి యటనుండి బెంగుళూరునకును, అచ్చటనుండి తిన్నగా బల్లారికిని, పిమ్మట నుత్తరముగా హైదరాబాదునకును, తరువాత నాగపురప్రాంతము వరకును జుట్టివచ్చిన నీనడుమగల యావద్దేశ మాంధ్రదేశముగా బరిగణింపబడుచున్నది. అనగా గంజామును, విశాఖపట్టణమును, గోదావరియు, కృష్ణయు, గుంటూరును, నెల్లూరు మండలములును, చెంగలుపట్టుమండలములో గొంచెముభాగమును, చిత్తూరు లేక ఉత్తరార్కాడు మండలములో సగము భాగమును, అనంతపురము, కడప, కర్నూలు (కందనోలు) మండలములును, బల్లారిమండలములో కొంతభాగమును, నైజాము రాజ్యములో విశేషభాగము (అనగా నల్గొండ, ఓరంగల్లు, ఖరీమ్‌నగరు, మహబూబునగరము, మెతుకు, ఎల్లందలజిల్లాలును, ఇందూరు బీడరుజిల్లాలలో కొంతభాగమును) నాగపుర గోండ్వానాదేశములలో నొక కొంచెము భాగమును జేర్చిన నాంధ్రదేశమేర్పడి కొంచెమించుగ లక్షయుఁ బదునేడువేల మైళ్ల వైశాల్యముగలిగి యొప్పుచున్నది.