పుట:Andhrula Charitramu Part-1.pdf/363

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మని జయించెను. రెండవకులోత్తుంగచోడదేవునికి సంబంధించిన కులోత్తుంగ చోలన్ఉలయను కావ్యమునందు విక్రమచోడుడు కళింగట్టు పారణయను కావ్యమును గ్రంథకర్తనుండి యంకితముగాంచినట్టు చెప్పబడియుండెను. విక్రమచోడుని కాలములో రెండవయుగము శాసనములలో జెప్పబడిన ప్రకారము కొంతకాలము వేంగిదేశములోనుండి యుత్తరదేశమును జయించుటగానున్నది. పల్లవదేవుని పిఠాపురము శాసనము చోడదేశమును బాలించుటకై వెళ్లుటకు బూర్వము విక్రమచోడుడు వేంగిదేశమును బాలించుచుండెనని చెప్పుచున్నది కాబట్టి వీరచోడునికి బిమ్మట రాజప్రతినిధిగానుండి యితడు 1118వ సంవత్సరమున బిలువంబడు నంతవఱకు వేగిదేశమును బరిపాలించుచుండెననియె నిర్ధారణము సేయవచ్చును. ఇతడు చోడదేశమునకు బోయినతరువాత వేగిదేశమున రాజులేడని మల్లపదేవుని పిఠాపురము శాసనము చెప్పియుండుటవలన నాకాలమున దేశమునకేవియో కష్టములు సంప్రాప్తములయ్యెనని భావింపవలసి యున్నది. పృథ్వీశ్వరుని పిఠాపురము శాసనములో కులోత్తుంగ చోడదేవుడు పదునాఱువేల గ్రామములు గలిగిన వేంగిరాజ్యమును తనకుదత్తపుత్త్రుడయిన వెలనాటి చోడునకు దానము చేసెనని చెప్పబడియున్నది. ఈవెలనాటి చోళుని యొక్క దాక్షారామమములోని యొకశాసనములో నతడు క్రీస్తుశకము 1120-21వసంవత్సరమున బశ్చిమచాళుక్యరాజగు నాఱవవిక్రమాదిత్యునకు లోబడిన యొక సామంతుడుగ నున్నట్టు చెప్పబడియుండెను. కాబట్టి పై శాసనములలోని వాక్యములను మనమిట్లు సమన్వయము చేసికొనవచ్చును. విక్రమచోడుడు వేంగిదేశమునువిడిచి దక్షిణమునకు వెళ్లినతరువాత కులోత్తుంగ చోడదేవుడు తనపుత్త్రులతో సమానముగా జూచుకొనుచుండిన వెలనాటి చోడునకు వేంగిరాజ్యాధిపత్యము నొసంగెననియు, విక్రమచోడుడు దేశమును విడిచిపోవుటయు, బిమ్మట కులోత్తుంగ చోడదేవుడు మరణము జెందుటయు జూచి యదియ మంచిసమయముగానూహించి పశ్చిమచాళుక్యుడగు విక్రమాదిత్యుడు దండెత్తివచ్చి వేగిదేశమునుజయించి రాజప్రతినిధిగ వెలనాటిచోడునే నియమించపోయెనని యూహింపవచ్చును. ఈయాఱవవిక్రమాదిత్యుని శాసనము