పుట:Andhrula Charitramu Part-1.pdf/361

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేత నీతెలికతెగవారు అయోధ్యను బెజవాడనుగూడ పాలించినవారమని చెప్పుకొనుచున్నట్లు గాన్పించుచున్నది. ఇటులె టేకిశాసనముగూడ సూచించుచున్నది.[1]


"వెలమనూళ్లు, పత్తిపాలు, నరియూళ్లు, కుముదాళ్లు, మఱ్ఱూళ్లు, పావండ్లు, శ్రావకులు, ఉండ్రూళ్లు, అనుమగొండలు, అడ్డమాళ్లు," అను తెలికతెగవారిలోని దశవిధశాఖలును టేకిశాసనమున బేర్కొనబడినవి. ఈ తెగవారికింగల రాజభక్తిని మెచ్చుకొని రాజరాజచోడగంగు తెలికతెగవారిలోని వివాహదంపతులు గుఱ్ఱమముపైనెక్కి యూరేగవచ్చుననియు, వివాహమహోత్సవానంతరము వివాహదంపతులు రాజునుదర్శించి విలువగలిగిన నూతనవస్త్రముల రెంటిని దెచ్చి రాజుపాదములకడ గానుకగాబెట్టి సాష్టాంగదండ ప్రణామం బాచరింపవలెననియు, అప్పుడానూతనదంపతులకు తాంబూల మీయబడుననియు గౌరవీనీయమైన క్రొత్తహక్కును గలుగజేసినట్లుగ టేకిశాసనము చాటుచున్నది. ఈ శాసనమును విద్యాభట్టు విరచించెను. ఆ కాలమునందలి చాళుక్యచోడులశాసనముల బెక్కింటిని విద్యాభట్టు వ్రాసియుండెను. ఇతడు నన్నయభట్టు కుటుంబములోని వాడయియుండునని యూహపొడము చున్నదిగాని ప్రబలప్రమాణములేనిదే విశ్వసింపరాదు. ఈ శాసనమును బట్టి తెలికతెగవారిలోనంతకు బూర్వమిట్టి హక్కువారికిలేదని స్పష్టముగా జెప్పవచ్చును. చోడగంగు 1089దవ సంవత్సరమున రాజప్రతినిధి పదవినుండి తొలగింపబడిన తండ్రిచే స్వస్థానమునకు బిలుపించుకొనబడియెను. వీనిసోదరుడయిన వీరచోడుడే మరల రాజప్రతినిధిగా బంపబడియెను. వీరచోడుడు 1093 వసంవత్సరమవఱకు బరిపాలనము చేసినతరువాత నీస్థానమునకు వీనితమ్ముడయిన విక్రమచోడుడు నియమింపబడియెను.

విక్రమచోడుడు.

కులోత్తుంగ చోడదేవుని నాలుగవ కుమారుడయిన యీ విక్రమచోడు[2]

  1. Nos. 189, 192 of 1897, see Report
  2. Ep. Ind, Vol VI, p. 334