పుట:Andhrula Charitramu Part-1.pdf/291

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కళింగదేశముననుండు నాగరికత జావాసుమత్రాదీవులకు వ్యాపించెనని గాథలలో జెప్పుకొనుట మాత్రముండెను. గాని చాలాకాలమువఱకు బ్రత్యక్ష నిదర్శనమేమియుగానరాకుండెను. ఇటీవల కాలధర్మమునొందిన కోహెన్ స్టువార్టుగారి వలన గనుగొనబడిన రెండుశాసనములవలన కాయి, జావా లిపుల యుత్పత్తియొక్క నిజతత్వము బోధపడినది. ఈ రెండును సంస్కృత భాషలో వ్రాయబడినవి. వీనిలోని లిపి వేంగిరాజుల ప్రాచీన శాసనములలోనిలిపిని బోలియున్నది. బెయిటన్ జార్గునకు ననతిదూరమున నున్న జాంపియా(Tjampea) జాంబో(Djambo) అను ప్రదేశములలోని కొండలపై సంస్కృత శ్లోకములు మనోహరముగా జెక్కబడియున్నవి. హిందూరాజుయొక్క పాదములను నీకొండలపై నీద్వీపములను జయించి నందుకు గుర్తుగా జెక్కబడినవి యూహింపబడుచున్నది. ఈమహాకార్యమును నిర్వహించినది పూర్ణవర్మయని పేరు దెలుపబడినది. ఈ శాసనములను బోలిన మఱియుకొ శాసనము జెబాన్కోపి(Xebon Kopi) అను ప్రదేశమున గానవచ్చుచున్నది. ఈ మూడు శాసనములు సుండాదీవులలో మిక్కిలి పురాతనములయినవిగ గన్పట్టుచున్నవి.

కాబట్టి శాసనపరిశోధకుల యభిప్రాయము ప్రకారము పూర్ణవర్మ కళింగమును, వేంగిని, కాంచీపురమును బాలించిన పల్లవులలోనివాడై యుండవలయునని బోధపడుచున్నది. ప్రాచీన వేంగిపల్లవశాసనములలిపిని బోలియుండుటచేత నైదవ శతాబ్దమున కీవలివాడుగాడని చెప్పవలసియుండును. ఆ కాలము నందలి పల్లవులందఱు నొక్క కూటములోని వారేగాని యన్యులుగారని డాక్టరు బర్నలుగారు సహితము నుడువుచునేయున్నారు. కాంచీపురమును బాలించిన ప్రాచీనపల్లవుల దేశములో విశేషభాగ మాంధ్రదేశముగానే యుండుట చేత బూర్ణవర్మ యాంధ్రదేశములోనివాడేయనియు, వానితో జావాద్వీపమునకు బోయున బ్రాహ్మణు లాంధ్రద్రావిడబ్రాహ్మణులై యుందురనియు జెప్పవచ్చును. సుమత్రా జావాద్వీపములలోని క్లింగులను వారు కళింగదేశమునుండి వచ్చిన తెలుగువాండ్రని పెక్కండ్రు చరిత్రకారులు తలంచుచుండగా