పుట:Andhrula Charitramu Part-1.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈశాసనములో దానముచేసినట్లుగ నుదాహరింపబడిన తోటయొక్కఫలము ముప్పదినాలుగు భాగములుగ విభాగించి యిరువదినాలుగు బ్రాహ్మణుకుటుంబములకు నొక్కొక్కొనికి నొకభాగము మొదలుకొని నాలుగుభాగముల వఱకు దానముచేయబడియుండెను. ఈ శాసనము కోలివోలా గ్రహారీకుడును మంత్రాలోచన సభ్యుడును నగుభట్టిశర్మ యొక్క స్వహస్త విలేఖనముతో గూడినదిగ నున్నది. దీనిని రాజు స్వయముగా బరిశోధించి చేవ్రాలు చేసియుండెనట. శాసనము తుదను గోబ్రాహ్మణులకును, విలేఖకునకును, పాఠకులకును, వినువారికి శుభవాక్యము పలుకబడియెను. తనవంశముయొక్కయు, తనజాతియెక్కయు, పరంపరాభివృద్ధికిని యశోభివృద్ధికిని ఈ దానము చేయబడినట్లుగ జెప్పబడినది.

కాలనిర్ణయము.

శాసనములోని భాషను బట్టియు, అందుదాహరింపబడిన కాలమునుబట్టియు శివస్కందవర్మ క్రీస్తుశకము రెండవశతాబ్దములోనివాడని రివరెండు టి. ఫపుల్క్సు గారు యుక్తియుక్తముగ సిద్ధాంతీకరించినారు. [1] ఇంత సహేతుకమైనవాదము మఱియొకటిగానరాదు. వీరు శివస్కందవర్మ రెండవశతాబ్దములోని యాంధ్రభృత్యులతో సమకాలికుడని రెండు హేతువులను జూపిరి. ఆంధ్రభృత్యుల శాసనములలోని భాషయె యీశాసనమునందును గానవచ్చుట మొదటిది. దానము చేసినతిథి తెలుపబడినవిధాన మాంధ్రభృత్యులశాసనములలోని విధానమును బోలియుండుట రెండవది. ఈ రెండు హేతువులచేత నాంధ్రభృత్యులకు దూరముననుండువాడు కాడనియును, సమకాలికుడనియును సిద్ధాంతము చేసినారు.

శివస్కందవర్మ శాసనములలో శాలివాహన శకసంవత్సరములకు మాఱుగా వానిపరిపాలన సంవత్సరములయొక్క సంఖ్యలు పేర్కొనబడినవి. మాసము

  1. The Journal of the Royal Asiatic Society,Vol XXI. (New series),IV. pp 1111 to 1124,