పుట:Andhrula Charitramu Part-1.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తో - పో -హా - నా (so-to-pho-hatt-na)అనగా శాద్వహన వంశములోని వాడనియు, స్యెంతోకియాయని (sh-yen-toh-kia)పిలువబడుచుండెననియు, మఱియక చీనాయాత్రికుడగు "ఈచింగ్"అనునతడు నుడువుచున్నాడు. క్రీస్తు శకము 431వ సంవత్సరమునందుండి నాగార్జునాచార్యుని సుహృల్లేఖకు సంస్కృత భాషాంతరీకరణము గావించిన గుణవర్మయను నాతడు వానిని శ్యాంథోకియా యనియె పిలిచెను. చీనాదేశస్థులు సంస్కృతనామములను భాషాంతరీకరించునపుడు వారివారి యిష్టానుసారము పోవుచు వచ్చిరిగాని యొకదారిని పోయియుండలేదు. ఆంధ్రరాజుల వంశము శాద్వహనవంశము కాదనియు శాతవాహన వంశమనియు మనమెఱుగుదుము. విదేశీయుల యుచ్ఛారణలయందిట్టి మార్పులు గానంబడుచుండుట యొక క్రొత్తవిషయముకాదు. మన పేరులను విదేశీయులును విదేశీయుల పేరులను మనమును తప్పుగా నుచ్ఛరించుచునేయున్నారము. శ్యంఠోకియా లేక శాంథోకియా యను నామమునకు భాషాంతరీకరణముగానరాదు. తిబెటీయ గ్రంథములయందతడు "బ్డె-బైడ్"అని పిలువబడుచున్నాడు. అనగా శంకరుడని సంస్కృతభాషాంతరీకరణము చేయబడియెను. సుఖమును గలుగజేయువాడు శంకరుడనియర్థము. ఉదయనుడని యతడు పిలువంబడుచుండెననియు, యౌవనమున నాతడు జేతకుడనికూడ పిలువంబడుచుండెననియు, తారానాథుడు చెప్పుచున్నాడు. ఈ పేరులెంత మాత్రమును శాంథోకియాయను పేరునకు సరిపోయియుండలేదు. శాతవాహన వంశము లేక అంతివాహనవంశమని వాని వంశనామమును తారానాథుడు పేర్కొనుచున్నాడు. ఈ పైనుదాహరింపబడిన దానింబట్టి చూడగా నీతడు కడపటి యాంధ్రరాజులలో వాడైయుండుననియు, నాసిక కన్హేరి శాసనములలోని శ్రీయజ్ఞశాతకర్ణియే యై యుండవచ్చుననియు మనమూహించి నిశ్చయింపవచ్చును. ఇతడు రెండవ శతాబ్దాంతమునను మూడవ శతాబ్ద ప్రారంభమునను ఆంధ్రరాజ్యమును బరిపాలించుచుండెనని మనము దెలిసికొనుచున్నారము. నాగార్జునుడు కూడ నీ కాలమునందే యున్నవాడు. ఇంకొకరీతిగ నాగార్జునుని కాలమును నిర్ణయింపవచ్చును. తిబేటీయ గ్రంథములలో రెండవ బౌద్ధసభను