పుట:Andhrula Charitramu Part-1.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
శాలివాహన విక్రమార్కుల గాథ.

ప్రతిష్ఠానమును బాలించుచుండిన శ్రీపులమాయి శాలివాహనుపైని, ఉజ్జయినీ పురాధీశ్వరుండయిన క్షాత్రపరాజు జయదాముడు దండెత్తి వచ్చి యుద్ధముచేసి మడిసిన చరిత్రాంశమును బురస్కరించుకొని యిటీవలివారు దెలియక క్రీస్తుశకమునకు బూర్వము రెండు శతాబ్దముల క్రిందటనున్న శాతవాహన వంశమునకు మూలపురుషుడైన శాతవాహనుడను శాలివాహనునకును, క్రీస్తు శకము 6వ శతాబ్దమునందుండి ఉజ్జయినీ నగరమును బరిపాలించుచుండిన యశోవర్మయను విక్రమార్కునకును ప్రతిష్ఠానపుర సమీపమున యుద్ధము జరిగెననియు శాలివాహనుడు యుద్ధములో విక్రమార్కుని తలద్రుంచెననియు నొకగాథను గల్పించి వారికి ముడిపెట్టిరి. ఈ గాథయే దేశదేశములందు బలురీతుల జెప్పుకొనబడుచున్నది. కథాసరిత్సాగరమున శాలివాహనుని మంత్రియగు గుణాఢ్యపండితుని జీవన వృత్తాంతము శాలివాహన జననమునకు ముడిపెట్టి గాథలు గల్పించిరి. ప్రతిష్టానమునందొక బ్రాహ్మణకన్య తన యిరువురి సోదరులతో నొక కుమ్మరివాని యింట నివసించుచుండి యొకనాడు గోదావరికి స్నానమునకు బోవుచుండగా శేషుడు చూచి యామెను మోహించి మానవరూపమునుదాల్చి యామెను కౌగిలించుకొనియెను. తరువాత కొంతకాలమున కామెకు గర్బముగలిగి శాలివాహనుడు జనించెను. వీడు కుమ్మరివానియుంట బెరుగుచుండెను. ఒకనాడు కాలికాదేవి విక్రమార్కునకు ప్రత్యక్షమై రెండేండ్ల బాలికకు జనించిన కుమారునిచే జంపబడుదువని జోస్యముచెప్పెనట! అట్టి వాడెక్కడనున్నాడోయని విక్రమార్కుడు పిశాచరాజగు బేతాళుని బంపి వెదకించెను. బేతాళుడు బాలికయైన తల్లితో నాడుకొనుచున్న శాలివాహనుని ప్రతిష్ఠానపురమునందుజూచి విక్రమార్కునికి దెలియజేసెను. అంతట విక్రమార్కుడు ప్రతిష్ఠానముపై దండెత్తి వచ్చెను. శాలివాహనుడు తన తండ్రి నాగరాజగు శేషుడు తనకుపదేశించిన మంత్రప్రభావముచేత మట్టి గుఱ్ఱములను, మట్టి యేనుగులను, మట్టి మనుష్యులనుజేసి వానికి బ్రాణప్రతిష్ఠజేసి యా సైన్యములతో విక్రమార్కుని నె