పుట:Andhrula Charitramu Part-1.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొంతసైన్యమును, మంత్రియగు విల్లవాన్ కొడైయనువానిని, వీరలతోడ హిమాలయమునకు బంపి, కావలసిన శిలను వీరలచే దెప్పించుకొని, దండయాత్రను ముగించి, గంగాతీరమునకు వచ్చి, శాతకర్ణి రాజబంధువులు సేనానులు గావించిన విందులను గుడిచి, అర్హమర్యాదలను బొంది, సంతుష్టుడై, మరలిపోయి, ముప్పది రెండు మాసములకు చేరరాజధానియగు వంజిపురమును జేరుకొనియెను. తరువాత నితడు రాజసూయయాగమును జేసెనట. [1] ఈ వృత్తాంతమును దన కావ్యమునందు జొనిపిన యిల్లంకో అడికాలను కవిని గ్రంథసన్యాసియనియు, చెంకుడ్డువానుననకు సోదరుడనియు నిదివఱకే దెలిపియుంటిమి. సమకాలీనుడగు నీ కవి వ్రాసిన యీ విషయములను బలపఱచుటకు శాసనాదులుగాని మఱియే గ్రంథ దృష్టాంతములుగాని గానరాకున్నయవి. వీనిచే జెప్పబడిన వృత్తాంతమునందతిశయోక్తులును భ్రమప్రమాద జనిత దోషములు గొన్ని కలవని యొప్పుకొన్నను ఈ విషయములన్నియు, గేవలము కల్పితములని త్రోసివేయుటకు మాత్రము ప్రబల హేతువులేవియు గన్పట్టకున్నవి. కాబట్టి గోతమిపుత్ర్త శాతకర్ణి కాలమున నాంధ్రరాజ్యము గంగాతీరము మొదలుకొని కాంచీపురము వఱకు వ్యాపించియుండెనని విశ్వసించుచున్నారు.

చస్తనుడు.

శాతకర్ణి యవనశకపహ్లవుల నిర్జించి సహపానవంశమును నిర్మూలించిన కాలమునందు చస్తనుడను క్షాత్రవుడు ఉజ్జయిని రాజధానిగ మాళవదేశమును బరిపాలింపుచుండుటను జూచి యాతడు (చస్తనుడు) శాతకర్ణిచే మాళవదేశమునకు రాజప్రతినిధిగ జేయబడెనని విన్సెంటుస్మిత్తుగారు వ్రాసియున్నారుగాని విశ్వసింపదగినదికాదు. యవనశకపహ్లవాదులను దఱిమి తఱిమి గొట్టి క్షహరాటసహపానుని వంశమునంత నిర్మూలము చేసినవాడు మరల నా సమూహములోని విదేశస్థునే పాలకుని జేసెననుట నమ్మదగినది కాదు. కోల్హాపురమునందు గన్పట్టిన నాణెములలో గొన్నిట గోతమిపుత్త్ర విలివాయకురుడను పేరు

  1. The Tamils : Eighteen Hundred years Ago. pp.91-98.