పుట:Andhrula Charitramu Part-1.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నొప్పగించెను. అంతట వర్తకుడు నిచ్చేష్ఠితుడై వారలకు నేమియు బ్రత్యుత్తరము చెప్పలేక కొయ్యవలె నిలువంబడెను. వీనిని నిజముగా దొంగయని యనుమానించి రాజభటులు వెంటనే తలనఱికివైచి యా యందెను రాజభవనమునకు గొనిపోయిరి. ఒక గొల్లవానియింట నివసించియుండిన యామె తన భర్త రాజభటులవలన నఱికివేయబడెనని దుఃఖాబ్ధిని మునింగి కంటికి నేలకు నేకధారగా నేడ్చుచు భర్త రాణియొక్క యందెను దొంగిలించిన కారణమున నిట్లు తల నరికివేయబడెనని విని కోపోద్రేకముతో రాజసభకు బోయి తన భర్త కడనుండిన యందె తనదికాని రాణిదికాదని సహేతుకముగ ఋజువుచేసెను. నిరపరాధియైనవానికి మరణశిక్ష సంభవించెనుగదాయని మూర్ఛితుడై రాజు పడిపోయి యట్లె దీర్ఘనిద్రపోయెను. రాజు మరణమునకు జింతించుచు రాణి భర్తతో సహగమనము చేసెను. అంతట మహాపతివ్రత తన స్తనము నొకదాని కోసివేసి మధురాపురమును, రాజు భవనమును మండిపోవును గాక యని శపించి మన రాజ్యమునకు వచ్చి విగతప్రాణయై పడిపోయినది. అచ్చట మధురాపురము రాజుభవనముతో మంకిపోయినది. ఈ కథవిని రాజును రాణియు మిక్కిలి వగచి యా మహాపతివ్రతయైన వితంతువు దేవతనుబోలె బూజింపదగినదని తలంచి యేమి చేయదగునని పండితుల సలహాయడిగెను. వారు హిమాలయములోని యొక శిలతో నామె విగ్రహమును జేయించి గంగాస్నానము గావించి కొనివచ్చి యిక్కడ ప్రతిష్ఠ చేయించి పూజించుట సర్వోత్తమమైన కార్యమని సలహాచెప్పిరి. వాని మంత్రి విల్లవాన్ కొదైయనువాడు "దేవా మహాశూరుడవు; ఆర్యరాజులు నీకు శత్రువులయినను మగధరాజులయిన శాతకర్ణులు నీకు మిత్రులు కావున నీకొక దుస్సాధ్య కార్యము కానేరదు" అని ప్రోత్సాహపఱిచెను. అంతట రాజు "ఆర్యరాజులు ద్రమిళరాజులనుజూచి యపహాస్యము చేయుచుందురని యాత్రికుల వలన వినియుంటిని. వారికి గర్వభంగము కలుగునట్లుగా మనము దండెత్తిపోయి యుద్ధములో వారలనోడించి వారిచేత మన మా శిలను మోయించుకొని మన దేశమునకు దీసికొనివచ్చినప్పుడుగదా ఘనకీర్తిప్రతాపములు వెల్లడియగునది" యని పలికెను. పిమ్మట వారు తమ రాజధానియైన వంజీపురము బ్రవేశించిన