పుట:Andhrula Charitramu Part-1.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాణియగు వాసిష్టికి బుత్రుడుగను గన్పట్టుచున్నాడు. శాతకర్ణి రెండవ శాసనములోని యధికారపత్రికను పులమాయియొక్క 18వ పాలన సంవత్సరమున నిచ్చినదగుటచేతను, ఆతని పాలనమును బేర్కొనియెడి తేదులుగల, శాసనములు, నాసిక, కార్లి పట్టణములలో మాత్రమె గాన్పించుటచేతను, అయ్యవి గోతమిపుత్రునికి సంబంధించిన తేదులు గాకపోవుటచేత తప్పక పులమాయి పాలనముయొక్క తేదులుగనున్నవి. గోతమిపుత్త్రుని మహత్కార్యములను నుదాహరించెడు పెద్ద శాసనముకూడ పులమాయి పాలన సంవత్సరమును బేర్కొనుచున్నది. ధాన్యకటకాధీశ్వరుడు గ్రామమునొకదాని భద్రాయనులకు దానము చేసినను అది వారలను దృప్తిపఱచనందున తాము మఱియొక గ్రామమును దానము చేయుచుంటినని పులమాయి చెప్పియుండుటచేత ధాన్యకటకాధీశ్వరుండు గోతమిపుత్రుడై యుండెను. గుహను సమర్పించుచున్నదని వర్తమాన కాలము దెలుపుచున్నందునప్పటికి గోతమికూడ బ్రదికియుండెననియె చెప్పవలసియున్నది. వీనినన్నిటిని పరిశోధించి చూడగా గోతమిపుత్త్ర శాతకర్ణుడు ప్రధాన రాజధానీ నగరమగు ధాన్యకటకమున పరిపాలనము సేయుచుండగా నా కాలమునందే యాతని కుమారుడును యువరాజునగు వాసిష్ఠీపుత్ర శ్రీ పులమాయి ప్రతిష్ఠాననగరమున (Paithan) రాజప్రతినిధిగానుండి పశ్చిమాంధ్రదేశమును (మహారాష్ట్రాది దేశములను) బరిపాలించుచుండెనని స్పష్టముగా బోధపడుచున్నది.

చెంకుడ్డువాన్ గోతమిపుత్ర శాతకర్ణుల మైత్రి.

ఇల్లంగో అడికాల్ అను దమిళకవి విరచితమగు చీలప్పదికారమను కావ్యమున విజయసేన కనకసేనలతో చెంకుడ్డువాన్ చేరరాజునకు గలిగిన పోరాటమునందు చేరరాజునకు దోడ్పడియెనని చెప్పబడిన మగధాధీశ్వరుండగు శాతకర్ణి యీ గోతమిపుత్ర్త శాతకర్ణుడనియె గన్పట్టుచున్నది. ఆ కాలమున నాంధ్రరాజులు మగధరాజులుగా బరిగణింపబడుచుండిరనుటకు నీ తమిళకావ్యమునందలి కథ ప్రబలసాక్ష్యముగా గన్పట్టుచున్నది. తమిలకమునకు మగధరాజ్యముత్తరపు సరిహద్దుగా బేర్కొనబడినది. ఉత్తరమున గంగాన