పుట:Andhrula Charitramu Part-1.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్రీస్తుశకారంభముననుండిన యీ శాతకర్ణియె ఖారవేలునకు మగధరాజుతోనైన యుద్ధమునందు తోడ్పడినవాడని చెప్పివిన్సెంటు స్మిత్తుగారు వీనిని నూటయేబది సంవత్సరములు వెనుకకు దీసికొనిపోయి విడిచిపెట్టిరి. అట్లుచేయుటకు గారణము గలదు. ఆంధ్రభృత్య వంశపురాజు లశోకుని కాలమునుండి పరిపాలించుచున్న వారని విశ్వసించెడు వారిలో విన్సెంటు స్మిత్తుగారొకరు. ఆంధ్రరాజులు ముప్పదుండ్రు 456 సంవత్సరములు మగధరాజ్యమును పరిపాలించిరని మత్స్యవిష్ణుపురాణములలో జెప్పినవాక్యములను, కాణ్వాయనుల యనంతర మాంధ్రరాజులు మాగధమును స్వాధీనము చేసికొనిరని చెప్పినవాక్యములను, క్రమమైనవని విశ్వసించిన వారగుటచేతను, పురాణములలో జెప్పబడిన కాలములనుబట్టి కాణ్వాయనుడగు సుశర్మ చంపబడినది క్రీ.పూ.23వ సంవత్సరమని విశ్వసించినవారగుటచేతను, అశోకుని కాలమునుండి రాజులను సరిపెట్టవలసివచ్చి పురాణములలో జెప్పిన ప్రకారము శ్రీముఖుడు సుశర్మను జంపినది మాత్రమొప్పుకొనక శ్రీముఖుని నశోకుని కాలమునాటికి గొనిపోయి ఈ శాతకర్ణుని ఖారవేలుని కాలమునబెట్టి సుశర్మను జంపుటకు కుంతల శాతకర్ణి, శాతశాతకర్ణి, పులమాయి, వీరిలోనొక్కని నుత్తరవాదిగ జేసి విడిచిపెట్టిరి. పురాణములలో శ్రీశుకుడనియు, శ్రీప్రకుడనియు సింధుకుడనియు వేఱ్వేఱునామములతో బిలువబడిన శ్రీముఖుడు కాణ్వాయనులను నిర్మూలము చేసినవాడని పురాణములన్నియు స్పష్టముగా జెప్పుచుండగా నిరాకరించుటకు హేతువునుజూపలేదు. కాబట్టి స్మిత్తుగారు పురాణములలో నుదాహరింపబడిన శ్రీశాతకర్ణిని ఖారవేలునికి దోడ్పడిన శాతకర్ణికి ముడిపెట్టుటగాని శ్రీముఖుని నశోకుని కాలమునాటికి గొనిపోవుటగాని కాణ్వాయనుల నాశనమున, కుంతల శాతకర్ణి మొదలగు వారియందారోపించుటగాని యుక్తియుక్తముగ గన్పట్టుచుండలేదు. కాన్వాయనుల యనంతరము దేశమును బాలించిన యాంధ్రరాజులను మాత్రమే పురాణములు పేర్కొనుచున్నవి కాని యంతకు బూర్వమాంధ్ర దేశమును బాలించిన రాజులను పురాణములు పేర్కొనియుండలేదు. సుచంద్రుడు విష్ణువు, దీపకర్ణి సాతవాహనుడు, శాతకర్ణియను రాజులు పురాణముల