పుట:Andhrula Charitramu Part-1.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాబట్టి మల్లకర్ణి, పూర్ణోత్సంగుడు, స్కందస్తంబినిగూర్చి చరిత్రాంశములేవియు వినరావు. వారల శాసనములుగాని నాణెములుగాని గానరావు. కాబట్టి కృష్ణుని తరువాత రాజ్యాధిపత్యమును వహించి ప్రసిద్ధిగాంచినవాడు శ్రీశాతకర్ణియనువాడు. ఇతడేబది యాఱు సంవత్సరములు పరిపాలనముచేసెనని పురాణములలో పేర్కొనబడియెను. పైనుదాహరించిన నానాఘట్టము గుహలోని యాఱు విగ్రహములలో నీ శాతకర్ణియొక్కయు, ఈతని పట్టపురాణి యొక్కయు విగ్రహములు రెండు గలవు. వానిపైన "దేవినాయని కాయా రాణోచసిరిసాతకానీనో" యని వ్రాయబడియుండుటచేత నందలి శ్రీశాతకర్ణి యితడేయనియు, ఇతని పట్టపురాణి వాయనికాదేవి యనియు వేద్యమగుచున్నది. ఇతనికి బూర్వుడగుటచేతనే శ్రీముఖుని విగ్రహమును వాని పేరును ముందు జిత్రింపబడిన తరువాత తన దేవియొక్కయు తనయొక్కయు విగ్రహములను జిత్రింపించెను. తరువాత కుమార భాయా యనువానిని విగ్రహముండెను. ఇతడు రాజునకు జ్యేష్ఠపుత్రుడై యుండలయును. తరువాత మహారాష్ట్ర నాయకుని విగ్రహముండెను. ఇతడు ప్రధాన సైన్యాధ్యక్షుడై యుండవలయును. తరువాత కుమారహాకు శ్రీయొక్కయు, కుమార సాతవాహనునియొక్కయు విగ్రహములుండెను. వీరు శాతకర్ణియొక్క కడపటి కొడుకులయి యుండవలయును లేక మనమలై యుండవలయును. ఎవ్వరయినను మహారాష్ట్ర నాయకుడు దక్క యందఱును శాతవాహన వంశములో జేరిన యొక్క రాజకుటుంబములోనివారనుటకు లేశమాత్రమును సందియములేదు. శాతవాహన వంశజులయిన యాంధ్రరాజులు శాతకర్ణియను పేరును పలువురు వహించి యుండుటచేత గూడ కొంత చిక్కునకు గారణమగుచున్నది. శాతకర్ణియను శాతవాహన వంశవృక్షమునందు బల్మఱు గన్పట్టు చుండుటచేత విన్సెంటుస్మిత్తుగారు శాతకర్ణి వంశమని తలంచుట భ్రమకాని వేఱొండుగాదు. ఇంగ్లాండు దేశమునందు రాజ్యము చేసిన రాజులలో హెన్రీ, చార్లెసు, జార్జి, ఎడ్వర్డు పేరులు గలవారెందరు లేరు? మొదటి హెన్రీ , మొదటి చార్లెసు, మొదటి జార్జి, మొదటి ఎడ్వర్డు అని వరు