పుట:Andhrula Charitramu Part-1.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

న్వయించెడి మాలశబ్దముయొక్క వ్యుత్పత్తి సందిగ్ధముగా నున్నదనియు, అఱవములో నలుపునకు మాలశబ్దముపయోగింపబడుచున్నది గాని తెలుగులో నుపయోగింపబడుచుండ లేదనియు, మాలలనియెడి యనాగరిక జాతి వారిని పురాణములు పేర్కొనుచున్నవిగాని వారినివాసస్థానము సందిగ్ధముగా నున్నదనియు, పురాణములలో బేర్కొనబడిన పేరు రాజమహలు గొండలలో నివసించెడు నాదిమవాసులయిన మాలరులను, గొండుజాతులకన్వయించుననియు, దానిని తెలుగు పరయాలకు ముడివెట్టుట సాహసమని బిషప్ కాల్దువెల్లు దొరగారు వ్రాసియున్నారు.[1]

కాబట్టి యిదియును వారి వాదమున కంత ప్రయోజనకారి కాదు. ఆంధ్రరాణులగు గోతమియొక్కయు, వాసిష్టయొక్కయు పేరులు గోదావరి యొక్క రెండు శాఖలకు బెట్టబడినవని వాదముకొఱకు నొప్పుకొన్నను ఆంధ్రులు గంగాతీరస్థులని యా విషయమెట్లు సమర్థింపగలరో యెన్ని విధములచేత జూచినను మాకు గోచరము గాకయున్నది. ఆంధ్రులు గంగాతీరస్థులనుట వట్టి భ్రమకాని బలమైన సాక్ష్యముగాన్పింపదు. విల్ఫర్డు గారు చెప్పినట్లుగ ఎనిమిది శతాబ్దములుగాని, ఎల్లియాట్ గారు చెప్పినట్లుగ మూడుశతాబ్దములు గాని యాంధ్రులు గంగాతీరము నందుండినయెడల నొక్క శాసనమైన గానరాదా? ఒక్క కట్టడమైన గానరాదా? ఒక్క నాణమైనా గానరాదా? ఏదియును గానరాదు. ఇంక నాంధ్రదేశము నందన్నచో యచ్చట జూచినను బౌద్ధులయిన యాంధ్రరాజులు పరిపాలించిన చిహ్నములే గాన్పించుచున్నవి. ఎచ్చటజూచినను శిథిలములయిన బౌద్ధాశ్రమగుహలును, స్తూపములనియెడి బౌద్ధాలయములును, వానిలో నాంధ్రరాజుల శాసనములును, ఆంధ్రరాజుల బంగారు వెండి సీస నాణెములును గాన్పించుచున్నవను మాటవారెఱుంగనిది గాదు. ఆంధ్రరాజు

  1. Comparative Grammar of Dravidian Languages, p.549