పుట:Andhrula Charitramu Part-1.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డనుటకు శ్రీశుకుడని, భ్రమప్రమాదదోషమున వ్రాసియుండవచ్చునని భాండార్కర్ పండితుడు చెప్పినమాట యుక్తియుక్తముగనుండుటచేతను శ్రీశుకుడే శ్రీముఖుడని చెప్పినందువలన బ్రత్యవాయమేమియు లేదు. కాణ్వుని జంపినవాడు పురాణములలో జెప్పబడిన పురులుగలవారిని శ్రీముఖునిగూడ స్మిత్తు గారు నిరాకరించి మఱిముగ్గురి పేరులుచెప్పి వారిలో నెవ్వడో యొకడై యుండునని తలంచినను శ్రీశుకుడే శ్రీముఖుడని యొప్పుకొనియున్నారు. [1] సుశర్మను జంపినవాడు శ్రీశుకుడని పురాణములుద్ఘోషింపుచుండగా గాదనిచెప్పుటకును, తాము పేర్కొనిన ముగ్గురిలో నొకడై యుండునని చెప్పుటకును, స్మిత్తుగారు హేతువులను గనబఱచియుండలేదు. ఇంతియగాక యాంధ్రభృత్యవంశములో శ్రీముఖుడు మొదటివాడని కూడ చెప్పిరి. పురాణములలో బేర్కొనబడినవారిలో నీతడు మొదటివాడనియే మేమును అంగీకరింతుముగాని యీతనికి బూర్వమాంధ్రరాజులు లేరిన యూహించి చెప్పెడు మాటలు మాత్రము విశ్వసింపదగినవికావు. శుంగవంశజులు క్రీ.పూ.185వ సంవత్సరము మొదలుకొని 112 సంవత్సరములనగా 73వ సంవత్సరము వఱకు బరిపాలించిరని చరిత్రకారులందఱు నంగీకరించిరి. పురాణములలో గాణ్వాయనులయిన నలుగురు బ్రాహ్మణపాలకులకు జెప్పిన 45 సంవత్సరములకు శుంగవంశజులకు జెప్పిన 112 సంవత్సరములలో నిమిడియున్నవని భాండార్కర్ గారు చెప్పినదానిని స్మిత్తుగా రాక్షేపించియున్నారు గాని కొంచెము విమర్శదృష్టితో జూచిన పక్షమున భాండార్కరుగారూహించినదే సహేతుకముగాగన్పట్టుచున్నది. ఎందుకన "చత్వారః శృంగభృత్యస్తే నృపాః కాణ్వాయనాద్విజాః" యని కాణ్వాయనద్విజులను శృంగభృత్యులనియు "కాణ్వాయస్థ (నంత) తో భృత్యః సుశర్మాణం ప్రసహ్యతం, శృంగాణాం చైవయచ్చేషంక్షపయిత్వా బలంతదా" యని కాణ్వాయనులను మాత్రమేగాక శృంగవంశజుల శేషించిన యధికారమును గూడ [సింధుకుడను పేరుగల యాంధ్రభృత్యుడు

  1. Ibid. p.193