పుట:Andhrula Charitramu Part-1.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విశ్వాసములను సాంఘీకస్థితిని దెలుపుటకు మాత్రము చాలియున్నది. ఆ కాలమునందు శైవమతమంకురించి ప్రజలలో వ్యాపించుచున్నది. స్వప్నములయందును జన్మాంతరములయందును, దేవతలయుందును మూఢవిశ్వాసము మెండుగా గలదు. గుణాఢ్యునియొక్కయు, సాతవాహనునియొక్కయు జన్మాదిక వృత్తాంతమునుబట్టి ఆర్యులుకనార్యులకు సంబంధ బాంధవ్యములు వెలయుచున్నవనియు సంకరసంతానము వర్థిల్లుచున్నదనియు బోధపడకమానదు. గుణాఢ్యుడు బ్రాహ్మణ స్త్రీకిని నాగకుమారునకును జనించియు శూద్రుడుగాగాని చండాలుడుగాగాని పరిగణింపబడక తన విద్యాప్రభావముచేత బ్రాహ్మణుగానే పరిగణింపబడుచుండెను. ఇట్లే యార్యబ్రాహ్మణ సంతతి యంతయు సాంకర్యమునుజెందుచుండెను. ఆంధ్రులుకూడ మిశ్రజాతివారని సాతవాహనుని జన్మాదికమును దెలుపగాథయెవేనోళ్ల జాటుచున్నది. మఱియు నొక్కవిశేషముగలదు. సాతవాహనుడు తొలుత విద్యావిహీనుడైయుండి విద్యావతియైన పట్టమహిషి చేత నధిక్షేపింపబడి సిగ్గుజెంది విద్యావంతుడగుటకు బ్రయత్నించి గుణాఢ్యశర్వవర్మల కృషిచేత బండితుడై విద్యావతియైన పట్టమహిషి పట్ల కృతజ్ఞతను జూపి యాదరించిన విధమెంత మోదావరాముగా నున్నది! ఈ విషయమొక్కటియే స్త్రీవిద్యయొక్క ప్రభావమును వేనోళ్లజాటుచున్నది. మనయాంధ్రదేశములో బ్రాచీనకాలమున స్త్రీవిద్యమిక్కిలి గౌరవింప బడుచుండెననుట సాతవాహనుని చరిత్రమే ప్రబలసాక్ష్యముగానున్నది. అనార్యులయిన జనసామాన్యముయొక్క భాషను వృద్ధిపొందింపబూని ప్రయత్నించిన విధమును ఆ కాలమునందలి రాజులును మంత్రులును జనసామాన్యభాషను నాదరింపుచు గ్రంథములు వ్రాయుచు వ్రాయించి వ్రాసినవారిని సత్కరించు చుండినట్లును, ఆర్యులా భాషయందును తద్భాషాగ్రంథములయందును అసూయతగలిగి యుండినట్లును బృహత్కథ వృత్తాంతమునుబట్టి మనకు సులభముగా బోధపడుచున్నది. ఈ మొదటి శాతవాహనునకును పురాణములలో బేర్కొనబడిన శ్రీముఖశాతవాహనుకును నడుమ ఖారవేలునకు దోడ్పడి మగధరాజగు పుష్యమిత్రునితో యుద్ధముచేసిన శాతకర్ణియను వాని పేరు దక్కమఱియొక యాంధ్రరాజుపేరు