పుట:Andhrula Charitramu Part-1.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నముతో సమానముగా భాగమిచ్చుట కూడదనియును, జ్యేష్ఠునకు దక్కిన వారికంటె నధిక భాగమీయరాదనియును జెప్పియున్నాడు. మఱియు నీతనికి బూర్వమునందు నౌరసకుమారునితో సమానముగా క్షేత్రజునకు (స్వభార్యయందితరునకు జనించినవాడు); గూఢజునకును (తన కుటుంబములోని స్త్రీకి జనియించియు నెవ్వనికి జనించెనో తెలియబడక యుండువాడు); కానీనునకును (పెండ్లికాకపూర్వము కన్యకు జనించినవాడు); సహోఢునుకును (తెలిసియో తెలియకయో గర్భవతిగా నున్న దానిని వివాహము చేసికొన్నప్పుడా గర్భవతియైన పెండ్లికూతునకు జనించినవాడు) యౌరస పుత్రునితో సమానముగానెంచి భాగమిచ్చు నాచారమున్నప్పుడప్పటి యార్యసంఘము పరిశుద్ధముగా నున్నదని యెవ్వరు చెప్పగలరు? బ్రాహ్మణునకు శూద్రస్త్రీయందు జనించినవాడు నిషాదుడనిచెప్పినను వానిని గూడ నౌరసకుమారునితోబాటు చూచుచుండిరి. ఈ సంకరసంతానమాపస్తంబునిచే నంగీకరింపబడలేదు. మఱియును నాకాలమునందాచరణలోనున్న నియోగమును (భర్త సమ్మతినిబడసి సంతానము కొఱకు నన్యపురుషునితో గలియుట) గూడనీతడంగీకరింపలేదు. వివాహప్రతిజ్ఞను ధిక్కరించి వివాహబంధమును ద్రెంచిస్వేచ్ఛగా వర్తించు భర్తగాని, భార్యగాని నరకమునకు బోవుదురని యాపస్తంబుడు కంఠోక్తిగజెప్పెను. ఈ రీతిగా నాపస్తంబుడెన్నియో సంస్కరణములను గావించెనుగాని యనాంధ్రజాతుల బాధించెడి క్రూరములయిన నిబంధనల నెన్నిటినోగల్పించెను. శూద్రుడు వేదము పఠించినయెడల నాలుక కోయవలసినదనియు, వేదము విన్నయెడల సీసము కరిగించి చెవిలోబోయవలసినదనియు, వాడు వేదము జ్ఞాపకముంచుకొన్న యెడల వాని దేహమును రెండు తునకలు చేయవలసినదనియు ననేక సూత్రకారులు శాసించిరి. దీనింబట్టి యాకాలమున ననార్యజాతులయం దెట్టి కరుణాళుత్వము జూపగలిగియుండిరో విస్పష్టముగ దెలియకపోదు.

ఈ సూత్రకారుల యభిప్రాయము లనార్యుల విషయమున నెంత క్రూరములుగా గన్పట్టినను ఆ కాలమునందు మన యాంధ్రదేశమునగాని దక్షిణాపథ దేశములలో మఱియెచ్చటగాని యీ యార్యుల ప్రభావమంతగా విజృం