పుట:Andhrula Charitramu Part-1.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్పు వారెవ్వరును గానరాకపోయినకతమున వారి చారిత్ర మింతవఱకు దేటపడక యంధకారముననే పడియున్నది. ఎవ్వరిని ద్రావిడులని చరిత్రకారులుద్ఘోషించుచున్నారో వారి పూర్వులే నాగులు. పూర్వము వారికి నాగులనియె పేరుగలిగియుండెను గాని ద్రావిడులని పేరు గలిగి యున్నట్లు గన్పట్టదు. ద్రావిడులను పేరిటీవలి సంస్కృత గ్రంథకారులు స్మృతికర్తలు మొదలగు వారిచే బెట్టబడినది గాని యనాది సిద్ధమైనది కాదని తోచుచున్నది. నాగులే ద్రావిడులనియెడు మాయభిప్రాయము సరియైనదయిన యెడల దక్షిణాపథ వాసులను ద్రావిడులనుటకు మేమంగీకరింతుము. అట్లుగాక ద్రావిడులు వేఱుగా నున్నవారని సిద్ధాంత మేర్పడిన యెడల నిప్పటి యఱవము, మళయాళము, తెలుగు, కన్నడము మొదలగు భాషలు మాటలాడువారు కేవలము ద్రావిడులుగారని చెప్పగలుగుదుము. ఈ నాగులు కొంతవఱకు నాగరికత గల వారుగా నున్నారుగాని కేవలము నాగరికులని చెప్పరాదు. వీరెచ్చటనుండి వచ్చిరని చెప్పినను వీరి మొదటి నివాసము తక్షశిలానగర ప్రాంతదేశమని మేము నిశ్చయించుచున్నారము. అచ్చటనుండియె వీరలు హిందూదేశము నలుప్రక్కలకుబోయి యరణ్యభూములాక్రమించి జనాకీర్ణములయిన దేశములుగా జేసిరని మా యభిప్రాయము. ఈ విషయమున జాలవఱకు డాక్టరు ఫెర్గూసను గారి యభిప్రాయములో నేకీభవించుచున్నారము.

ఆంధ్రులకు నాగులకు గల సంబంధము.

ఆంధ్రదేశము నాగనివాసమని బౌద్ధుల గాథలవనను, అమరావతీ స్తూపములోని నాగుల యొక్కయు, నాగరాజుల యొక్కయు జిత్తరువుల వలనను మఱికొన్ని చరిత్రాంశముల వలనను, ఆర్యులకు బూర్వమీ దేశమున నివసించుచుండి పాలించినవారు నాగులని స్పష్టపడినందున మొదటి యాంధ్రులు నాగులనియే దోచుచున్నది. మేము పూర్వప్రకరణము నందు జెప్పినట్లుగ ననార్యాంధ్రులు తప్పక నాగులనియె మా యభిప్రాయము. ఆర్యులు కొంతరు నాగులపక్షమవలంబించి నాగుల మతమునే కొంతవఱకు స్వీకరించి యార్యాచారముల గొంతవరకు నాగులచే నవలంబింప జేసిన వా రార్యాంధ్రులు. ఆకారణము