ప్రేల్చిరి. విజయరామరాజు దేహమునందు బలుతావుల గాయములుపడెను. దానికిని లక్కచేయక వాడికత్తితో విరోధిసేన నఱకుచుండెను. ఒడలినుండి రక్తము విశేషముగా గారుచుంటచే గొంతసేపటికి విజయరామరాజు పడిపోయెను. రాజుపడిపోయిన సంగతి వినినంతనే హతశేషులగు సైనికులు చెదరిపాఱిపోయిరి. రాజుస్థితి మిగుల దుస్తరముగా నుండెను. ఒడలంతయు గాయములతో నిండిపోయెను. ఇంతలో నాంగ్లసైనికులు నాలగైదుతుపాకుల నొక్కమాఱు ప్రేల్చిరి. విజయరామరాజు ఘోరమరణ మొందెను. కర్నలు పెండర్గాష్టు సంగరము నాపివేయించి యుద్ధప్రదేశమును దిలకించుటకు వచ్చెను. మూడువందల తొమ్మిదిమంది క్షత్రియసైనికులు వీరమరణము నొంది పడియుండిరి. విజయరామరాజు చుట్టును కోటగట్టినట్టుల నలువదిమంది క్షత్రియవీరులు తుపాకి దెబ్బలచే జచ్చిపడియుండిరి. వీరమరణమొందిన యాంధ్రవీరుల కళేబరములు ఆంగ్లసేనాధిపతికి మిగుల నాశ్చర్యము కలుగజేసెను. స్వతంత్రసంరక్షణము కొఱకు భటునివలె బోరాడి రణరంగమున నొఱగిన విజయరామరాజు త్యాగము పాశ్చాత్యులకు విస్మయము గూర్చెను. ఆంగ్లసైనికులు క్రమశిక్షణ గలవారగుటచేతను తుపాకులు ఫిరంగులు లోనగు మారణ పరికరములు సమృద్ధిగా నుంటచేతను విశేషనష్టమొందక జయించిరి. కంపెనివారిసేనలో బదుముగ్గురు మాత్రమె మర