పుట:Andhraveerulupar025958mbp.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గావించి ప్రచ్ఛన్నముగ నటనట జీవింపసాగిరి. అనపోతనాయ డును దయాశూన్యుడై రాచపురుగును మిగుల్తు మేని యేనాటికైన నపాయము రాకమానదని తనయాజమాన్యమున గల దేశమంతటనుగల రాచవారలనందఱను బాలురనక వృద్ధులనక స్త్రీలనక శిశువులనక తెగటార్చి సోమకుల పరశురామ బిరుదము సార్థకము గావించుకొని శత్రుజనకంటకుడై రాజ్యము పాలించెను.

కాలక్రమమున దాదాపుగ నిజామురాష్ట్రములోని యాంధ్రదేశమంతయు ననపోతభూపాలకుని హస్తగతమయ్యెను. అతడు భువనగిరి, ఓరుగల్లు, రాచకొండ, రామగిరి, గోలకొండ, కంబముమెట్టు, దేవరకొండ దుర్గములు స్వాధీనముగావించుకొని విరోధియనువాని దలయెత్తనీయకుండ సర్వైశ్వర్య సంపన్నుడై వయ:కాలమునంతయు బరరాజ్యాకర్షణముతో విజయయాత్రలతో గడుపు చుండెను. విజయయాత్రల కేగుచు మార్గమధ్యముననున్న యయ్యనవోలు మైలారుదేవుని సందర్శించి యాగ్రామము నంగరంగ వైభవాదికములతో నుత్సవాదికములు జరుగుటకై దానమొనరించి యనపోతనృపుడట నొకశాసనము స్థాపించెను. ఈవీరవతంసుని విక్రమజీవితము చాలవఱ కాశాసమున లిఖింపబడియున్నది. అందు సోమకుల పరశురాముడగు నీ యనపోతరాజుపరాక్రమ మీవిధమున వర్ణింపబడి యున్నది.