వ్రయ్యలై రక్తము ప్రవహించెను. వెంటనే యావీరులు వేఱొక యేనుగులజంటను రప్పించి వానినారోహించి ద్వారభేదనమునకుదలపడిరి. ఇట్లు విశ్వప్రయత్నముమీద బద్మనాయక వీరులు ద్వారమును భేదించి ముందడుగువేసిరి. రాచవారు మూర్తీభవించిన ధైర్యమో యనునటుల స్థానము వదలక లోని కేతెంచు ప్రతిపక్షవీరుల నందఱ యథావిధి నురుమాడి దుర్గ సంరక్షణమున నప్రమత్తులై విక్రమించిరి. బురుజుల చెంత నున్నసైనికుల మాటిమాటికి బద్మనాయక సైన్యముతో దలపడి పోరుచు నాగ్నేయాస్త్రముల విచ్చలవిడిగా బ్రయోగించుచు నింతయనరాని విప్లవము ఘటించిరి. సంగరమర్మజ్ఞు డగు ననపోతనాయడు ప్రత్యర్థుల యొక్కయు దన యొక్కయు బలాబలములు విచారించి దుర్గములో నెటులేని ప్రవేశింపకున్నచో నపజయము తటస్థించి తీరునని నిశ్చయించి సైనికులనందఱి ద్వారమునుండి లోనికి జొఱబడ నాజ్ఞాపించెను. సముద్రమువలెనున్న పద్మనాయక సైన్యము ద్వారము గాపాడు రాచవారిబలముల నురుమాడుచు గొంచెముసేపటికి దుర్గములోని యన్నిభాగములకు బ్రవేశించి యాయుధశాలల నాక్రమించుకొని ప్రతిపక్షుల నెక్కడివారి నక్కడ నురుమాడిరి. కొన్నిదినంబు లుభయదళంబుల కింతయనరాని ఘోరసంగ్రామము జరిగెను. కడకు జయముపై నాసవదలి యుద్ధకార్యము నిర్వహించు రాచవారు ప్రాణభీతిచే దుర్గ