పుట:Andhraveerulupar025958mbp.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బడెను. విద్యారణ్యులవా రదిచూచి మిగుల నాశ్చర్యపడి రాజసోదరుల కావింతజూపించి: 'రాజకుమారులారా! ఈప్రదేశము నూతనరాజధాని కనువగుతావు. ఇచట రాజ్యమును స్థాపించితిమేని చిరకాలము వెలుగొంద గలదు. ఇదియె నాకభిమత ప్రదేశ' మనగా వారును ఆమోదించిరి. విద్యారణ్యులు శ్రీ విద్యాచక్రానుసారముగ సరిహద్దులు నిర్ణయించి నగరవీధులు రాజమందిరములు, ప్రకృతిజనుల నెలవులు, దుర్గమములకు దావులు నిశ్చయించి శుభముహూర్తమున విద్యానగరమను పేరుతో నూతననగరరాజప్రతిష్ఠ గావించెను. ఆ శుభముహూర్తబలముననో, రాజసోదరుల అదృష్టవశముననో అచిరకాలములో విద్యానగరము మహాపట్టణముగా మాఱెను. విద్యారణ్యులు పెట్టిన శుభముహూర్తమున హరిహరరాయలు తన రాజధానిని ఆనెగొందినుండి విద్యానగరమునకు మార్చుకొని హితబంధు సామంతరాజసమక్షమున మహోన్నత వైభవముతో బట్టాభిషిక్తుడాయెను. పరాక్రమశాలియు న్యాయమూర్తియునగు బుక్కరాయలను బ్రజానుమతంబున విద్యారణ్యులవారు విజయనగర సామ్రాజ్యయువరాజు నొనరించెను. రాజసోదరు లిరువురు నాటగోలె నూతనరాజ్యమును విస్తరింపజేయుటకు సర్వశక్తులు థారవోసి విజయయాత్రలకు బరికరములు సమకూర్పదొడగిరి.