పుట:Andhra bhasha charitramu part 1.pdf/506

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆచ్ఛిక ప్రకరణము.

సంస్కృత సమేతరమయిన యాంధ్రభాష నాచ్ఛికమని వైయాకరణులు పిలుచుచున్నారు. తెనుగునందలి పదములు సంస్కృతసమములు, ప్రాకృతసమములు, సంస్కృత భవములు, ప్రాకృతభవములు, దేశ్యములు, అన్యదేశ్యములు అను వర్గములుగ విభజింపబడుచున్నవి. శబ్దరత్నాకరమునగల 35,055 పదములలోలు 14,814 పదములు సంస్కృత సమములు: అనగా నూటికి 42 వంతున సంస్కృతశబ్దములు తెనుగు విభక్తి ప్రత్యయములు మాత్రము చేరినవి యా నిఘంటువున కెక్కినవి. 'ప్రా' అను సంజ్ఞతోనందు 'ఇంగలము' అనునొక్కపదముమాత్ర మున్నది. అది ప్రాకృతసమమని కాబోలు శ. ర. కారుని యభిప్రాయము. వానిలో 3891 పదములకు వై. అనగావైకృతము లనుసంజ్ఞ నాతడుంచినాడు. ప్రాకృత సమములు, సంస్కృతభవములు, ప్రాకృతభవములు ననుమూడువర్గములును నీ వర్గములోనికి చేరినవి. అన్యదేశ్యములను గుర్తించుటలో నాతడు కొన్నిటికి 'అన్యదే' యనియు, కొన్నిటికి హిం. (హిందూస్థానీ) అనియు, కొన్నిటికి 'ఆం.' (ఇంగ్లీషు) అనియు గుఱుతులుంచినాడు. ఇట్టిపదములు సుమారు 1800 కలవు. మిగిలిన వానిలో మిశ్రములు, అనగా సంస్కృతశబ్దములును దేశ్యములును కలిసిన శబ్దపల్లవములు, ధాతుపల్లవములు 170 ఉన్నవి; గ్రామ్యము లని యాతడుచెప్పిన 57 పదములునిట్టివే. ద్వయములు, అనగా వైకృతములును దేశ్యములును గలిసి శబ్దపల్లవములుగను ధాతుపల్లవములు గను నేర్పడిన పదములు 3227 కలవు. ఈ రీతిగ సుమారు 24000 పదములు సంస్కృతమునకును బ్రాకృతమునకును నన్యదేశ్యములకును సంబంధించినవి. మిగిలిన 11000 పదములలో 252 యుగళములు, అనగా నొకయర్థమున సంస్కృతమును వేఱొకయర్థమున దేశ్యమునయిన పదములు; 302 ఉభయములు, అనగా నొకయర్థమున వైకృతములు వేఱొకయర్థమున దేశ్యములునైన పదములు. యుగళములను ఉభయములను తత్సమ, తద్భవ పదములుగ నిరూపింప గలిగినచో నింక 10500 పదములు దేశ్యములుగ నిలుచుచున్నవి. వీనిలో 4046 పదములు దేశ్యములని శబ్దరత్నాకరకారుడు నిరూపించిన ధాతువులనుండి యేర్పడినవి. ఈదేశ్యధాతువుల యథార్థస్వరూపమును గూర్చి రెండవ ప్రకరణమున వివరింపబడియున్నది. ఇక మిగిలిన సుమారు 6000 దేశ్యశబ్దములకును గతియేమి? వానికి తెనుగున ధాతువులు కానరావు. వానిలో గొన్నిటి కితరద్రావిడభాషలయందు మాతృ