పుట:AndhraRachaitaluVol1.djvu/84

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీరంగమున నొకవత్సర ముండి నరసింహాచార్యు డింటికివచ్చెను. శ్రీవిజయనగర ప్రభువులును గాశినుండి వే చేసిరి. మన కవి మరల మహారాజ దర్శనముచేసెను. ఆనందగజపతియు వీరి కవిత్వగోష్ఠి కలరి వీరిని మరిమరి ప్రేమించుచు వార్షిక బహుమాన మొనగుచుండెను. ఆనందగజపతి చెప్పుటచే మహారాజు విజయరామగజపతికిని నరసింహాచార్యుని కవిత్వపాండిత్యాదులపై విశ్వాసము కలిగినది. అప్పు డా మహారాజుపై మన కవివరు డిట్లు చెప్పెను.


ఈ జగమందు నిందు నటులెల్లరకుం గనువిం దొనర్చు మై
యోజ గనంగ రాజనుట కుల్లము సందియ మొంద దిందునన్
రాజను మాట మా విజయరామనరేంద్రునకే పొసంగు పై
రాజులు శోకవహ్ని మదిరాజుట రాజు లనంగ జెల్లెడిన్.


డక్కా డడాంకరణ రవ
ఫక్కత్ఫణిప ఫణమణి నిపతనజ శూల
స్స్పక్కర్ణ కుహార ఘర్ఘుర
ముక్కోలపభీత గుప్తముఖ కూర్మేంద్రా!


ఈ పద్యములు విని విజయరామరాజు చాల సంతోషించి నరసింహాచార్యుని తన సంస్థానకవిగ నాదరించెను. భర్తృహరి మున్నగు కృతులు మహారా జీ పండితునికడ బఠించెను.


కూరెళ్ళ రామశాస్త్రియను పండితు లొకరు "ఉమాముఖం చుంబతి వాసు దేవ," అను సమస్య నిచ్చి పూరింపుడని నరసింహాచార్యుల నడగినపు డాయన తడవుకొనకుండ


భవష్యదీశోపయమం విచింత్య
హిమాలయస్యాలయ మేత్య కిం తే
సుతేతి చోద్ధృత్య శిశుత్వ ముగ్ధ
ముమాముఖం చుంబతి వాసుదేవ.


అని చదివెను. ఆశువున నింత యందముగ జెప్పుట యబ్బురము. సంస్కృతాంధ్రములు రెండిటను వీరికవిత ప్రౌడతరము. తెలుగున వీరు వ్రాసినవి తక్కువగ నున్నవి.