పుట:AndhraRachaitaluVol1.djvu/528

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యీనాడు వెలువడుచున్నవి. పద్యముల రాశితోనే కావ్యత్వ సిద్ధి యనరాదుగదా! "అమరుక కవేరేక శ్శ్లోక: ప్రబంధశతాయతే." కావ్యముయొక్క ఏకదేశానుసారియైనది ఖండకావ్య మని సాహిత్య దర్పణకారుడు. దీనికే సంఘాత మని నామాంతరము. ఇది యపూర్వము కాకపోయినను, పూర్వకవులలో ఖండకావ్య రచయితలు మిక్కిలి తక్కువ. నేడో మూడువమ్,తులు ఖండకావ్యముల కారు.

ఏతాదృశ కావ్య వాజ్మయ మధుమాసమున 'జాషువకవి' కషాయకంఠమున గాన మొనరించుచున్న పుంస్పికము. ఆయన ఉభయ భాషా ప్రవీణులు, కవితా విశారదులును. చరిత్ర ప్రసిద్ధమైన వినుకొండలో జాషువకవి జన్మించుట పేర్కొన డగినది. ఈ ధన్యత్వము, ఆయన గుర్తులో నుంచుకొని యిట్లు వ్రాసికొనెను:

శ్రీరాము డేకొండ శిఖరాన గన్నీట

నాలించె సీతాపహరణగాధ

దాటించె నేవీటి దాపున నైతమ్మ

పట్టి మేల్పొట్టేలి వాహనంబు

కోట కొమ్మలమీద గ్రుచ్చినా రేవీటి

తెలుగురాజుల విరోధుల శిరాలు

ముత్యాలతో నారబోసినా రేవీటి

నృపతు లేటేట బండిన యశస్సు

భాస్కరుని దానధార కేపట్టణంబు

చారు చరితకు బంగారు నీరు వోసె

నట్టి వినుకొండ కడుపున బుట్టుకతన

ధన్యుడను నేన యుత్తమోత్తముడ నేన.

జన్మస్థానము వినుకొండ యగుగాక, తెలుగుమండలము సర్వము జాషువకవి కీర్తికి స్థానమైయున్నది. సాధారణ ప్రజానీకములోసైతము