పుట:AndhraRachaitaluVol1.djvu/477

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సామ్రాజ్య చారిత్రము అపూర్వమైన యొక ధర్మ విజయ గీతము ; ఒక అహింసావిజయగాథ, అది భారతీయుల మంజుల మధుర మనోహర స్వాప్నిక గానము.


ఏమో ఎవ్వరెఱుగుదురు, ఎప్పుడు పుట్టిపెరిగి అంతటి పెద్దవాడయ్యెనో? ఎంత కాలమునుండి యచ్చట నివాసముండెనో? చరిత్రకు కొంతప్రాజ్ఞత వచ్చునాటికే ఆయుష్మంతుడయిన ఆర్యకుమారుడు భారతభూమిని పచ్చనిపైరుచేల నడుమ, వనలక్ష్మి అందాలు దిద్దుకొని సాంద్రాటవీ సీమల మధ్య ఆశ్రమపదములు నిర్మించుకొని పర్ణకుటీరములందు కర్మపరతంత్రుడై విరాజిల్లెను. ముందగ్నిహోత్రముతో పార్శ్వములయం దధ్యయన పరాయణమైన ఛాత్ర బృందముతో వేద ఋక్కులు వల్లెవేయుచు, నెడనెడ సామగానము నాలపించుచు తాను త్రొక్కినంతమేర భూతములను కర్మనిబద్ధముగను, ధర్మనిబద్ధముగను గావించి తనచూపు ప్రాకినంత లెక్క తానే పెద్దనని గడ్డము సవరించు కొనుచు దర్పముతో ప్రవర్తించిన కర్మవీరుడతడు. జగత్తింకను నిద్రాపరవశమై యుండగనే తొలుదొలుత మేలుకాంచి తెలివి తెచ్చుకొని పెద్దఱికము వహించిన ప్రోడ యతడు. ఎవ్వ రెఱుగుదురు? ఎప్పుడు పుట్టి పెరిగి యంతటి పెద్దవాడయ్యెనో? ఎంతకాలమునుండి యచ్చట నివాసముండెనో?...."


"చారిత్రకవ్యాసములు' 2 పుట


చక్కని తీరుదల యిట్టిరచనలో నెన్నో క్రొత్తవిషయములు శర్మగారు తెలుగువారి కిచ్చుచున్నారు. విజ్ఞాన దృష్టికి మల్లంపల్లి వారి జీవితమొక వసంతారామము. ఆర్థిక దృష్టిలో, ఆయన నిరంతర శ్రమజీవి. బాల్యమునుండియు బేదఱిమికి బాలువడి విజ్ఞాన సమార్జనము చేసికొనెను. మనుగడలో నొడుదొడుకులు, దుందుడుకులు రానిచ్చుకొనని స్వభావము మొదటి నుండియు నున్నది. ఆంగ్ల విద్యలో నున్నత