భాషాపరిశోధకులు, విమర్శకులు కవులుగా నగుట యసదు. ఆ యదృష్టము ఒక్క ప్రభాకరశాస్త్రిగారికే పట్టినది. కడుపు తీపు-కపోత కథ - మూనాళ్ల ముచ్చట - మత్త విలాసము - భగనదజ్జుకము - ప్రతిమా నాటకము మున్నగు కృతులు శాస్ర్తిగారు వెలయించినారు. వీనిలో సగము ఆంధ్రీ కృతులు - సగము ఖండకృతులును. ఖండకావ్యములు కలకండములు. వేటూరి కవి తెనుగుమడుల కూర్పునేర్పు నబ్బురముగా నబ్బించుకొన్న చతురుడు. పద్య - గద్యముల రచన మంచి చిక్కగ నుండును. పెద్దనవలె రచనకు గొప్ప బింకము నిచ్చు సమర్థత యున్నది. ఎఱుక దవిలిన యొకసీసము వ్రాసెద.
కురులు చిక్కార్చి దిక్కులు గాంచి చేలాంచ
లము లద్దుకొని కంచెలం దొలంచి
మొగము మంగళసూత్రమును నోలగందంబు
పసుపున బూసి మన్ విసరివైచి
గుమురొత్తు పులకల నిమిరి పొక్కిలిబంటి
నీట నీరెండ మైనాటడిగ్గి
గుమ్మడి మూటగా గూర్చుండి చిగురాకు
దొప్పదోసిళ్ళ నీ రప్పళించి
దరని గల బ్రాహ్మణుండు మంత్రములు పలుక
నల కనకగాత్రి కృష్ణలో జలక మాడె
గరగ బోసిన పొంగు బంగార మసగ
సంగ కాంతులతోడ దరంగలాడ.
'కడుపుతీపు' లోనిది.
పదముల కుదిరికను, భావము పొదుపును గ్రింది పద్యములలో నరయవచ్చును.