పుట:AndhraRachaitaluVol1.djvu/365

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నముతో బ్రహ్మరథము పట్టినది. ఇంతసేయుట కాయనలో వెల్లి విరిసిన కవితావేశము కారణము. ఈ కవిసింహము 'వీరమతీచరిత్ర' మను పద్యకావ్య మొండు రచించెను. అందలి పద్యసంఖ్య తొమ్మిది నూఱులు. 'చండనృపాలచరిత్ర' యేడువందల గ్రంథము. వీరచరితములపై, దేశగాథలపై వీరికి మమకారము హెచ్చు. 'ఆర్యావర్త వీరనారీమణులు' అను వీరి యాంగ్లభాషాకృతి బహుప్రశస్తమయినది. వీ రేఱుకొన్న యితివృత్తములు పెక్కు వీరగాథలే. ఈ కవి మొత్తపు గవిత్వరచనలో నుండునవి రెండు దృక్పథములు. ఒకటి వీరము, రెండు భక్తి. సీతాకల్యాణాదులగు పౌరాణికనాటికలు రెండవదృక్పథమునకు సూచకములు. కాగా, మిగిలిన కృతులెల్ల వీరగాథా గ్రథితములు. ఆకృతు లన్నింటిలో 'ప్రతాపసింహచరిత్రము' కన్నాకు. రాజశేఖరునకు జీవము పోసిన దా మహాకావ్య మొక్కటే. దాని ప్రశంస యింక నవసరము.


రాణా ప్రతాపసింహ చరిత్ర


పఠితల కేకావ్యముమీద బెద్దయభిమానముండునో, ఆ కావ్యము మీద దత్కర్తకు గూడ నంత మమకార ముండియుండునని యూహింపవలయును. యథా లాభముగా వ్రాసివైచిన గ్రంథముపై పాఠకునకు నంత యపేక్ష యుండదు. "నా కావ్యము ప్రతిరసికమాననము నావర్జింపవలయు" నను పట్టుదలతో గవి రచన సాగించుచొ నారచన మట్లు చేసితీరును. ప్రకృతము రాజశేఖరకవి 'రాణా ప్రతాపసింహ చరిత్ర' విషయము.


ప్రపంచ విఖ్యాతుడైన అక్బరు పాదుషాతో నిరువదైదు వత్సరములు సంగరము చేసి భారతస్వాతంత్ర్య పతాక నెగురవైచిన విశ్వవీరచూడామణి మహారాణా ప్రతాపసింహుడు. అట్టి ధర్మవీరుని చరిత్రాంశములు