పుట:AndhraRachaitaluVol1.djvu/356

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సరిచేసి యొసగుట యొకటి-అనేక వాజ్మయములలో నచ్చుపడిన గ్రంథము లెల్ల జూచి, ఆయా సారస్వత రహస్యము లర్థము చేసికొని సంభాషణ సమయములో సాహిత్య సముద్రుడు వలె దోపింపజేసికొనుట రెండు-పద్యరచనలో, వచనరచనలో బత్రికా సంపాదకతలో గ్రొత్తదారు లేరిచూపుట మూడు- శివశంకరశాస్త్రిగారు ఏవంవిధ గుణత్రివేణీ సంగమ తీర్థము. ఈ తీర్థములో నవగాహించిన తెలుగు యువకు లెందరో !


శాస్త్రిగారు పండ్రెండవ యేటనే కవితకు శ్రీకారము చుట్టుకొనిరి. నోరి హనుచ్ఛాస్త్రిగారి కడ ఛందస్సు కూడ నేరిచిరట. ఛందస్సు కూడ నొక శాస్త్రముగాన, ఆ శాస్త్రీయ విషయము లేవో కొన్ని గురుముఖమున వినుటయే గాని పద్యము లల్లుట నేర్చుకొనగా వచ్చునది కాదు. అభ్యాసాగత మైనది యట్లే యుండును. మన శాస్త్రిగారికి గవితా గురువు ప్రతిభయే. వీరి కననేల ! సహజ కవుల కందరకు బ్రతిభయే గురుత్వము చేయును.


మెట్రిక్యులేషన్ వరకు జదివి శాస్త్రి గారంతతో బాఠశాల చదువు చాలించి, కంభంపాటి సీతారామ శాస్త్రిగారు, వేదాంతం శ్రీ రామశాస్త్రిగారల సన్నిధిని సంస్కృత సాహిత్య గ్రంథము లధ్యయనము చేసిరి. వేదాంతము లక్ష్మీపతి శాస్త్రిగారి యొద్ద వ్యాకరణము, శ్రీ జగద్గురు కల్యాణానంద భారతీ స్వాములతో వేదాంతము పాఠము చేసిరి. కురుగంటి శ్రీ రామశాస్త్రి గారి కడ నైయాయిక గ్రంథములు చదువుకొనిరి. ఆ తరువాత దర్శనములలో స్వయంకృషి. వినబడిన భాష, కనబడిన గ్రంథము చదువక విడువలేదు. వివిధ సారస్వతములలో సొగసులు కనుప తెలుగులో జొనుపు నేరుపు విరి కధికముగనున్నది. సాహితీసమితి కి సభాపతిత్వము నిర్వహించి యువకవుల నెందరనో ప్రోత్సహించెను. నవ్యసాహిత్యపరిష న్నిర్మాణ కర్మకారులలో బెద్ద