కవుల యభ్యుదయము గుఱుతించి శ్రీ పీఠికాపురాధీశ్వరుడు వీరి కొక ముద్రాయంత్రమునుగొనియిచ్చి తదుద్యమమునకు జేయూతనొసగెను. నరసారావుపేటలో జరిగిన ఆంధ్రసారస్వత పరిషత్తున శ్రీ ఉయ్యారు రాజావారి సభాధిపత్యమున నీకవులకు 'కవిరాజహంస' బిరుద మొసగబడెను. 1943 లో రాజమహేంద్రవరమున వీరికి షష్ఠిపూర్తి సమ్మాన మహోత్సవము వైభసపూర్ణముగా సాగినది. అప్పుడు కూడిన యాధునిక కవివర్గము వీరికి "కవికులాలంకార" బిరుదము నిచ్చి గౌరవించిరి. ఈ బిరుదములు రెండును వీరియెడ దగినటులుండి యందగించుచున్నవి.
ఉ. పావనమూర్తి నీశ్వరుని బమ్మెర పోతన రామరాజుగా
భావనచేసి పాడుకొనె భాగవతంబును; నట్లె రామభూ
మీ వరు సద్గుణావళుల మేము జగత్ప్రభు లీలగాంచి బృం
దావన కావ్య మంకిత మొనర్చితి మాతని పెండ్లిపాటగన్.
అని చెప్పి శ్రీ పిఠికాపుర యువరాజు గంగాధర రామరాయ ప్రభునకు 'బృందావనకావ్యము' నంకితము గావించిరి. ఈ కబ్బము శ్రీ రఘునాథరాయల కాలమున వెలసిన శృంగారకావ్యములను దలదన్ను చెన్ను ననున్నది. ఈ కూర్పు నేర్పు పరికింపుడు.
సీ. మణి కిరీటంబుపై మన్నింపలేదటే
కొరగాని పురినెమ్మికోడిఱెక్క
అధరపల్లవముపై నానింపలేదటే
వెలివోని విరసంపు వెదురుపుల్ల
శ్రీవత్సకాంతిపై జెలగింపలేదటే
వెలలేని చిఱుమోక తులసిరేక
కల్యాణమూర్తిపై గదియింపలేదటే
కొరరాని నసరాకుపురుగునూలు