పుట:AndhraRachaitaluVol1.djvu/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కలిగింపజూతురు. అంతకు పూర్వము కొంతకాలము క్రిందట జిన్నయ సూరి బాలవ్యాకరణము రచియించెను. దానితో సరిపోల్పదగిన యాంధ్రవ్యాకరణము మావరకు వేఱొకటి లేదు. అట్లుండగా కృష్ణమూర్తి గారిచే జేయబడిన వ్యాఖ్యానముతో గూడిన హరికారిక లనబడెడి యాంధ్రవ్యాకరణసూత్రగ్రంథ మొకటి యటు తరువాత నల్పకాలము నకు వెలువడెను. అదియే హరిభట్టకృతమై యధర్వణాదులచే బేర్కొనబడిన కారికావళియైన పక్షమున జిన్నయసూరి తన వ్యాకరణములోని సూత్రములన్నిటిని హరికృతగ్రంథమునుండి దొంగిలించి తన పేరిట బ్రకటించినట్లు స్పష్టమగుచున్నది. అయినను మూలగ్రంథములో జూపబడిన లక్ష్యములు కొన్ని యధర్వణాచార్యుల కిటీవలి యాధునిక గ్రంథములలోని వగుట చేత వ్యాఖ్యానమును మాత్రమే గాక మూలగ్రంథమును సైతము కృష్ణమూర్తిగారే రచించిరేమోయని పలువురు సందేహపడుతున్నారు. అట్టిగ్రంథమును రచియింపగల సామర్థ్యమా విద్వత్కవికి గల దనుటలో సందేహము లేదు. ఈయన ఎటువంటి గ్రంథకల్పనము సేయు సంశయపడపవారు కారని చూపుటకై చరమదశ యందు మాడుగల్లులోనున్నపు డొకరాత్రిలో జేసిన ట్టీయన కారోపింపబడిన యశ్వశాస్త్ర కథ కొంత తోడ్పడుతున్నది". [1]

ఈ వాక్యములు సావధానముగా జదివినచో సూరిగారి బాలవ్యాకరణమున కసూయపడి కృష్ణమూర్తిశాస్త్రిగారు హరికారికలు రచించిరనుట సుస్పష్టము. ఇది గాక హరికారికలు పెక్కుచోట్ల నసందర్భములుగా నున్నవికూడను. ప్రథమమున మదుపజ్ఞంబని చెప్పిన 'సంస్కృత వ్యాకరణము' ను ప్రచురము కాదని తలంచి బాలవ్యాకరణము తెనుగున సూరి రచించినాడు. చిన్నయసూరి కృష్ణమూర్తిశాస్త్రిగారి వలె సర్వతంత్రస్వతంత్రుడు, షడ్దర్శనీపారంగతుడు కాకపోవచ్చును. బాల

  1. కవుల చరిత్ర 588 పుట