పుట:AndhraRachaitaluVol1.djvu/236

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గా నొనరించితి లోకము
వానిం జవిచూచి యెఱుగు బలుకగనేలా!


అని పదునెనిమిది పర్వములతో నిండిన మహాభారతము నొక్క చేతిమీదుగా ననువదించి వెలువరించిన శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారి వంటి భాగ్యవంతులు తెనుగు వారిలో గంటికి గనబడువారరుదు. ఆశ్చర్యముపై నా శ్చర్యము మహాభారతమే కాక శ్రీమద్రామాయణము, భాగవతము కూడ శాస్త్రులు గారి చేతి మీద నాంధ్రీకరింప బడుట. భారత భాగవత రామాయణములు మూడును ముచ్చటగా తెనిగించి యచ్చువేయించి సహస్రమాన జీవితోత్సవము జరిపించుకొనియు నడుము వంచని పండితులు కృష్ణమూర్తి శాస్త్రి గారు. మహామహోపాధ్యాయులు, కళా ప్రపూర్ణులు, కవి సార్వభౌములు నగు శ్రీపాద వారి శతాధిక గ్రంధ రచనము కొందఱి కామోదము కలిగింప కున్నను భారత రామాయణా ద్యాంధ్రీకరణము మాత్ర మాశ్చర్యానందములు కలిగించనదని చెప్పవచ్చు. వీరి తెనుగుసేత యథా మాతృకముగా సాగినది. తొల్లిటి కవిత్రయము పరివర్తనము సేయక విడిచిన భగవత్గీతాది ఘట్టములు సైతము శాస్త్రులుగారు తూచాలు తప్పక తెనిగించిరి. భారతాంధ్రీకరణములో నన్నయ తిక్కనలను మించి యౌచితిని బాటించితినని శాస్త్రులు గారి విశ్వాసము. కవిత్రయ భారతము నందలి యౌచితీ సుందరత వేఱొక యాంధ్రగ్రంథముననే లేదని విమర్శకుల వ్రాతలు విమర్శనములు శాశ్వతముగా నుండవు. కృష్ణమూర్తి శాస్త్రులుగారు మహాభారత పీఠికలో నొకమాట చెప్పినారు.


నన్నయ తిక్కనాది కవినాథులకన్నను మిన్నగా దెలుం
గు న్నుడువంగలాడ నధికుండను నేనని కాదు, గ్రంథమం