పుట:AndhraRachaitaluVol1.djvu/219

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంపాదించి మరల నింటికి వచ్చి సాత్రాజితీవిలాసము, (యక్షగానము - 14 వ యేట వ్రాసినది) పంచనృసింహక్షేత్రము, శుకరంభాసంవాదము, కృష్ణార్జునసంగ్రహము మున్నగు కొన్ని కబ్బము లల్లి 18 వ యేట నాగిరిపల్లి గీర్వాణవిద్యాపీఠమునకు బోయి సాహిత్యగ్రంథములు, సిద్ధాంతకౌముది చదివి తనకవితకు బాండిత్యపు మెఱుగు పెట్టెను.

తరువాత 'సెకండుగ్రేడుప్లీడరు' పరీక్షలో నుత్తీర్ణులై బందరులో న్యాయవాదిగా బ్రవేశించిరి. బందరుపౌరులు నాడు వీరి పాదములు వెండిపూలచే బూజించి, బంగారుపూలచే శిరము నర్చించి పల్లకి నెక్కించి బ్రహ్మరథము పట్టిరని విందుము. ఉద్యోగము చేసికొనుచు వ్యాఖ్యానపఠనము గావించుచు గవితారచనము. 1884 లో జిల్లా కోర్టు పట్టాపొంది యేలూరు 'సబార్డినేటుకోర్టు' లో బండ్రెండేండ్లవిచ్ఛిన్నముగా నుద్యోగ ధర్మము నిర్వహించిన న్యాయవాది యాయన. శ్రీరామపండితు డెంతధనసంపాదకుడో యంతదాత. పండితులకు గవులకు నీయన యెన్నో సన్మానములు గావించె. కవులయెడ సహజముగ నుండునసూయాదిగుణములు వీరియెడ గనబడవు. సంగీతాభినయగ్రంథములు చాల రచించిన కళావిదు డీయన. జ్యోతిశ్శాస్త్రమున మంచి ప్రవేశము. 1901 లో "శ్రావణమాస మధికమా, ఆషాడమాస మధికమా ? యనుచర్చ రాజమహేంద్రవరమున జరిగెను. దీని పరిష్కరణమున మువ్వురు పండితు లేర్పడిరి. నాడు వీరి సిద్ధాంతమే నెగ్గిన దని పలువురు ప్రశంచిరి. ఇదిగాక సంఘసంస్కరణము, మతాచారములు, ధర్మము, బౌతికనీతులు మున్నగు విషయములు గుఱించి వీరనేక వ్యాసములు వెలువరించిరి. 1880 సం లో ...... ...... ...............