పుట:AndhraRachaitaluVol1.djvu/177

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పంతులుగారు చదువునాటికి మదరాసు పోవుటకు రైలుత్రోవలేదు. పొగయోడయే యాధారము. రామయ్యగారు పొగయోడలో బ్రయాణము చేయుచుండ నొకసారి యోడమీదనుండి జారి సముద్రములో బడిపోయిరి. ఓడకప్తాను చూచి తొందరగ వచ్చి పడిపోయిన పంతులుగారి జుట్టుపట్టుకొని మునిగి తేలుచ్చున్న సమయమున బయటికి లాగి బ్రతికించెనట. ఆయనజుట్టే ప్రాణభిక్ష పెట్టినది" పరిశోధకపండితశిరోమణి కాదగిన యిట్టి మహాశయుడు జలగండము పాలగు టెట్లు సమకూడును ?

పంతులుగారు ప్రథమమున మాధ్యమికపాఠశాలలో నధ్యాపకులు. తరువాత మండలాధికారి (జిల్లా మేజస్ట్రేటు) కచేరీలో లేఖకులు. అటుపై నచ్చటనే ప్రధానలేఖకులు. అనంతరము సహాయ మండలాధికారి (డిప్యూటి కలెక్టరు), తదనంతరము రాష్ట్రన్యాయాధికారి (ప్రెసిడెన్సీ మేజస్ట్రేటు) పిమ్మట శాసనసభాసభ్యుడు (ఎం.ఎల్.ఎ.)

క్రమముగా నుపకారవేతనము పొంది కళాప్రపూర్ణుడై సలక్షణాంధ్ర భాషాప్రతిష్ఠాపకు డని యశస్సు గాంచెను. రామయ్యపంతులుగారు తెఱపిలేని రాజకీయోద్యోగములకు దమ నవయౌవనమంతయు దారవోసిన పట్టభద్రులు. ఏయుద్యోగమున నున్నను వీరికి సాహిత్యోద్యోగము మాత్రము సన్నగిల్లలేదు. పగలెల్ల నుద్యోగధర్మము నిర్వహించుకొని రాత్రులు వీరు నిరంతరము సాహిత్యకృషి చేయుచుండెడి వారు. ఉద్యోగధర్మమున నేగ్రామమున కేగినను నచటి పండితులను గవులను సందర్శించి వారితో నేవో భాషావ్యాసంగములు సేయుచుండుట వీరికలవాటు. వీరిభాషాభిలాష క్రమముగా బెరిగినది. ఉద్యోగము నిర్వహించు నోపికయు దఱిగినది. ముక్తీశ్వరమున గాలు మీద గాలు వైచుకొని గ్రంథసమీక్షకు, భాషాతత్త్వ పర్యవేక్షణమునకు గడగి యనేకశాసనములు పరిశోధించి యనేకరహస్యములు