ద్రుండు దురత్యయోరుభవదోషవిదూర మన:ప్రచారుడై
మండగి మాదిరాజు గుణమండితవందితు డొప్పు నప్పురిన్- [ఆ.1]
ఉ. పట్టకు పట్ట కింక వృషభం బది మాటలు చెల్లినప్పుడే
పెట్టితి లింగముద్ర యదె బీరము తప్పగ బట్టి తేనియున్
గొట్టుదునీశిరంబు ధర గూలగ మాబసవన్న యాన చే
పట్టుల గాచుటెల్ల శివభక్తులకున్ బిరుదంబుగావునన్- [అ.5]
శా. ఆనందాశ్రుపయోధి నిట్టవొడువన్ హర్షోత్థరోమాంచస
శ్రీ నెమ్మేనికి భూషణంబుగ లసద్గ్రీవోద్గమద్గద్గద
ధ్వానమ్ముల్ గురుకర్ణసత్వములుగా దాత్సర్యమున్ భక్తియున్
లోనన్ గీల్కొనియున్న యాత్మసుతు నాలోకించి మై పెంచుచున్- [ఆ.7]
_______
15. పిడుపర్తి బసవకవి
ఇతడు శైవబ్రాహ్మణుడు. బసవపురాణమును పద్య కావ్యముగా రచియించిన సోమనాధుని తమ్ముడయిన పాలనార్యుని పుత్రుడు. కాబట్టి యీకవియు నించుమించుగా సోమనాధుని కాలమునందే యున్నవా డగుటచేత 1520 -వ సంవత్సర ప్రాంతమునం దున్నవాడని చెప్పవచ్చును. ఇతడు పాల్కురికి సోమనాథుడు రచియించిన ప్రభు లింగలీలను తెనుగున నైదాశ్వాసముల పద్యకావ్యముగా రచించెను. ఈ బ్రభు లింగలీలయందు బసవేశ్వరునికిని బసవేశ్వరుని మేనల్లుడయిన చెన్న బసవన్నకును గురువయిన యల్లమప్రభుడను జంగమదేవరయొక్క కథ చెప్పబడియున్నది. పిడుపర్తి బసవకవియొక్క కవనవిధము తెలియుటకై ప్రభులింగలీలనుండి రెండుమూడు పద్యముల నుదాహరించు చున్నాను.-