పుట:AndhraKavulaCharitamuVol2.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చ. స్తుతమతి యైనయంధ్రకవి ధూర్జటిపల్కుల కేల కల్గెనో

యతులిత మాధురీమహిమ-


అని సమస్య యిచ్చినట్లును వారిలో నొక రీక్రిందిరీతిని సమస్యా పూరణము చేసినట్లును చెప్పుచున్నారు:


చ. స్తుతమతి యైనయంధ్రకవిధూర్జటిపల్కుల కేల గల్గెనో

యతులిత మాధురీమహిమ? హా తెలిసెస్ భువనైకమోహనో

ద్ధత సుకుమారవార వనితాజవతా ఘనతాపహారి సం

తత మదురాధరోదితసుధారసధారలు గ్రోలుటంజుమీ.


పయిపద్యమునుబట్టి చూడగా ధూర్జటికవి సంతత వేశ్యాప్రియుడయిన రసికపురుషు డయినట్టు కనుపట్టు చున్నాడు. అట్టి యఖండ శివపూజాధురంధరుడైన భక్తాగ్రేసరుని నిట్టి జారత్వదోష మేల విడువకుండెనో యూహింపజాలకున్నాము. మనదేశముయొక్క దౌర్భాగ్యము చేత జిరకాలమునుండి యిచ్చట విశుద్ధచరిత్రము మతమునుండి విడిపోయినది. ఎట్టి దుశ్చరిత్రముగలవా డయినను విభూతి, రుద్రాక్షలు మొదలయిన బాహ్యచిహ్నములను ధరించినమాత్రమున భక్తాగ్రేసరుడుగా బరిగణింపబడుచున్నాడు. అయినను క్రమముగా నిప్పుడిప్పుడు మతమునకు సత్ప్రవర్తన మావశ్యకమన్న సత్యము జనుల మనస్సులలో నాటుకొనుచున్నందున కెంతయు సంతసిల్ల వలసి యున్నది. ఈమహాకవియొక్క కవితాధార తెలియుటకయి కాళహస్తిమహాత్మ్యములోని కొన్ని పద్యముల నిం దుదహరించుచున్నాను:-


చ. అమితము లైనజంతువుల కక్కడ నుత్తమ మధ్య మాధమ

త్వము లరయంగ గాన మపవర్గరమాసతి బెండ్లియాడుచో

సమతయెకాని తత్త్పురముసాటిగ నన్యపురంబు లెన్నగా

సమరు నటన్న హస్తిమశకాంతర మంతియ వాసి చూచినన్. [ఆ.1]