పుట:AndhraKavulaCharitamuVol2.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చ.ఘనతరఘూర్జరీకుచయుగక్రియ గూడముగాక ద్రావిడీ

స్తనగతి దేటగాక యరచాటగునాంధ్రవధూటిచొక్కపుం

జనుగవలీల గూడతయు జాటుతనంబును లేక యుండ జె

ప్పినయదెపో కవిత్వ మనిపించు నగిం చటుగాక యుండినన్.


ఈ పద్యము వేంకటనాథకవికృత మగు పంచతంత్రమునందు గానబడుచున్నది. పెద్దనార్యుడు సంస్కృతాంధ్రములయం దసమానసాహిత్యము గలవాడు. ఇత డొకనాడు కృష్ణదేవరాయల యాస్థానములో సకలకవీశ్వరులు నుండగా రాజు కోరికమీద నుభయభాషా పాండిత్యము వెల్లడి యగునట్లుగా నొక యుత్పలమాలిక నాశుకవిత్వముగా జెప్పి సభవారినందఱిని మెప్పించి కాలికి బిరుదందె వేసికొన్నవాడు. రాజు కవిగండపెండేరమును బసిడిపళ్లెరమున నునిచి, సంస్కృతాంధ్రములందు సమానముగా కవిత్వము చెప్పగలవారు దీనిని ధరింపనర్హులని పలికినప్పుడు పెద్దనార్యుడు లేచి యీక్రింది యుత్పలమాలికను జదువగా రాజు మెచ్చి తానే యాకవిగండపెండేరమును కవిపాదమున దొడిగెనట-


ఉ. పూతమెఱుంగులున్ బసరుపూపబెడంగులు చూపునట్టివా

కైతలు జగ్గునిగ్గు నెనగావలె గమ్మున గమ్మనన్వలెన్

రాతిరియున్ బవల్ మఱపురా:హొయల్ చెలియారజంపుని

ద్దాతరితీపులంబలెను దారసిలన్వలె లో దలంచినన్

బాతిగ బైకొనన్వలెను బైదలి కుత్తుకలోనిపల్లటీ

కూత లనన్వలెన్ సొగసుకోర్కులు రావలె నాలకించినన్

జేతికొలంది గౌగిటను జేర్చిన గన్నియచిన్నిపొన్ని మే

ల్మూతలచన్నుదోయివలె ముచ్చట గావలె బట్టిచూచినన్

డాతొడనున్న మిన్నులమిటారపుముద్దులగుమ్మ కమ్మనౌ

వాతెఱదొండపండువలె వాచవిగావలె బంట నూదినన్