పుట:AndhraKavulaCharitamuVol2.pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

56. కాకునూరి అప్పకవి

ఇతడు వైదికబ్రాహ్మణుడు, పదునేడవ శతాబ్దమధ్యమునందుండిన లక్షణవేత్త. ఈకవి యాంధ్రశబ్దచింతామణి యనుపేరితో సాధారణముగా నప్పకవీయ మని వాడ బడెడు లక్షణగ్రంథమును పద్య కావ్యమునుగా రచించెను. ఇత డెనిమిదాశ్వాసముల గ్రంథమును జేయునట్లు ప్రతిజ్ఞ చేసినను, అయిదాశ్వాసములు మాత్రమే యెల్లయెడల గానబడుచున్నవి. తక్కిన యాశ్వాసములు చేయకమునుపే యితడు మృతినొంది యుండవచ్చును. ఈయప్పకవీయమునందు ఛందో విషయము సమగ్రముగా నున్నను, వ్యాకరణవిషయ మత్యల్పముగా నున్నది. ఇప్పుడున్నభాగములో సంజ్ఞా సంధి పరిచ్ఛేదములు మాత్రమే తెనిగింపబడినవి. ఇతడు బహుగ్రంథములు శోధించినవాడే యయినను, పూర్వగ్రంథములనుండి యిత డుదాహరించిన పద్యములన్నియు దాదాపుగా లింగమగుంట తిమ్మన్న మొదలయినవా రీతనికి ముందు చేసినలక్షణగ్రంథములలో గానబడుచున్నవి. ఇతడు తనకాలపువారయినకవుల గ్రంథములనుండి విశేషముగా బద్యములను జేకొని యున్నాడు. ప్రక్రియాకౌముదియు నాంధ్రశబ్దచింతామణియు నని నామాంతరములు గలనన్నయభట్టీయమును బాలసరస్వతికాలమువఱకు నెవ్వరు నెఱుగరు. అది నన్నయభట్టారకవిరచితమనియు, వేములవాడ భీమకవి దానిని గోదావరిలో గలుపగా నేనూఱుసంవత్సరములయిన తరువాత సారంగధరుడు దానిని దెచ్చి బాలసరస్వతి కిచ్చెననియు అప్పకవి కలగనెనట! అటు తరువాత నొక బ్రాహ్మణుడు దానిని తనకు దెచ్చి యీగా తెనిగింప నారంభించెనట! ఈగ్రంథారంభమునకు బూర్వమునం దప్పకవి యేదో తెలుగున ఘనకావ్యము చేయ సంకల్పముపూనిన ట్లీక్రింది పద్యమువలన దెలియవచ్చుచున్నది.